పెంచుకుంటూ పోయారు.. పింఛ‌న్ల పెంపుపై జ‌గ‌న్ మార్క్‌!

ఏపీలో సామాజిక పింఛ‌ను దారుల‌కు ప్ర‌భుత్వం తాజాగా శుభ‌వార్త చెప్పింది. మ‌రో 15 రోజుల్లో ప్రారంభంకానున్న నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా.. జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి సామాజిక పింఛ‌న్ల‌ను రూ.3000ల‌కు పెంచుతున్న‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. శుక్ర‌వారం జ‌రిగిన మంత్రి వ‌ర్గ స‌మావేశంలో ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌స్తుతం ఉన్న సామాజిక పింఛ‌న్ రూ.2750 నుంచి రూ.3000ల‌కు చేరుతుంద‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

ఫ‌లితంగా దివ్యాంగులు, తాత‌, అవ్వ‌లు, వితంతువులు, ఒంట‌రి మ‌హిళ‌ల‌కు నెల‌నెలా ఇక నుంచి రూ.3000 చొప్పున పింఛ‌న్ అంద‌నుంది. ఇది వారికి ఎంతో మేలు చేస్తుంద‌ని సీఎం జ‌గ‌న్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. అయితే.. రాష్ట్రంలో ఈ పింఛ‌న్ల‌పై జ‌రుగుతున్న ప్ర‌చారం వేరుగా ఉంది. ఎన్నిక‌ల‌కు ముందు పింఛ‌న్లు పెంచార‌ని.. ఎప్పుడో నాలుగేళ్ల‌నాడే పెంచాల్సి ఉంద‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ, క్షేత్ర‌స్థాయిలో 2019లో అప్ప‌టి ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా సీఎం జ‌గ‌న్ ఇచ్చిన హామీ వేరు.

ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌తిప‌క్ష నేత హోదాలో ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్ ‘మ‌న ప్ర‌భుత్వం ఏర్ప‌డితే.. పింఛ‌న్ల ను రూ.3000ల‌’కు పెంతామ‌న్నారు. అయితే.. ఆయ‌న ఈ విష‌యంలో అప్ప‌ట్లోనే క్లారిటీ ఇచ్చారు. ఒకే సారి పెంపు కాకుండా.. ఏటా పెంచుకుంటూ పోతామ‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి రూ.3000ల‌కు చేరుస్తామని కూడా.. అప్ప‌ట్లోనే జ‌గ‌న్‌స్ప‌ష్ట‌మైన క్లారిటీ ఇచ్చారు. ఈ విష‌యంపై త‌ర‌చుగా చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ప్పుడు లేదా.. ప్ర‌తిప‌క్షాలు ఆరోపించిన‌ప్పుడు కూడా.. వైసీపీ నాయ‌కులు అప్ప‌ట్లో జ‌గ‌న్ ఇచ్చిన హామీల ప్ర‌క‌ట‌న ల తాలూకు వీడియోల‌ను ప్లే చేస్తూనే ఉన్నారు.

వాస్త‌వానికి రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యానికి లోటు బ‌డ్జెట్‌లో ఉన్న ఏపీకి.. అనేక బాధ్య‌త‌లు, స‌మ‌స్య‌లు కూడా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో కీల‌క‌మైన సామాజిక పింఛ‌న్ల‌ను ఒకేసారి పెంచ‌డం ద్వారా ఖ‌జానాపై భారం ప‌డ‌కూడ‌ద‌నే ఏకైక ఉద్దేశంతో తాము అధికారంలోకి రాగానే క్ర‌మం త‌ప్ప‌కుండా ఏటా పెంచుకుంటూ పోయి.. చివ‌రి ఏడాది రూ.3000ల‌కు పింఛ‌ను అందిస్తామ‌ని ఎన్నిక‌ల స‌మ‌యంలోనే జ‌గ‌న్ చెప్పుకొచ్చా రు. ఆయ‌న అన్న‌ట్టుగానే చెప్పింది చేశారు.

2019లో ప్ర‌భుత్వం ఏర్ప‌డగానే.. 2020 జ‌న‌వ‌రి నుంచే రూ.250 పెంచారు. త‌ర్వాత‌.. ఏడాది2021లో మ‌రో 250 రూపాయ‌లు పెంచారు. ఇక‌, 2022-23 ఆర్థిక సంవ‌త్స‌రంలోనూ మ‌రో రూ.250 పెంచి.. ప్ర‌స్తుతం దానిని అమ‌లు కూడా చేస్తున్నారు. ప్ర‌స్తుతం రూ.2750 చొప్పున సామాజిక పింఛ‌ను అందిస్తున్నారు. ఇక‌, ఇచ్చిన హామీ ప్ర‌కారం.. ఇప్పుడు తాజాగా మ‌రో 250 రూపాయ‌లు పెంచి.. మొత్తంగా రూ.3000 చొప్పున నూత‌న సంవ‌త్స‌ర కానుక‌గా పింఛ‌ను అందించాల‌ని జ‌గ‌న్ స‌ర్కారు నిర్ణ‌యించింది.