కేసీఆర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ విమర్శలు

పదేళ్ళుగా బీఆర్ఎస్ లో నోరుమూసుకుని పడున్న గొంతులన్నీ ఇపుడు సడెన్ గా పైకి లేస్తున్నాయి. తాజాగా ఎంఎల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. బీఆర్ఎస్ ఎంఎల్సీ తక్కెళ్లపల్లి మాట్లాడుతు పదేళ్ళ పాలనలో క్షేత్రస్ధాయిలో సమస్యలను తెలుసుకునేందుకు కేసీయార్ ఏమాత్రం ఇష్టపడేలేదన్నారు. బీఆర్ఎస్ లో జోకుడు బ్యాచ్ కే కేసీయార్ ప్రయారిటి ఇవ్వటం వల్లే పార్టీ ఓడిపోయిందని తేల్చేశారు. పార్టీలో, జనాల్లోని అసంతృప్తిని కేసీయార్ తెలుసుకుని ఉండుంటే ఇపుడీ పరిస్ధితి వచ్చుండేది కాదన్నారు.

ఉద్యమంలో ప్రాణాలకు తెగించి, కేసులు పెట్టించుకుని పోరాటాలు చేసిన వాళ్ళని కేసీయార్ దూరంగా పెట్టయటం తప్పే అని ఎంఎల్సీ అంగీకరించారు. 2014,18 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ తరపున గెలిచిన ఎంఎల్ఏలను పార్టీలోకి లాక్కున్న విషయాన్ని తక్కెళ్ళపల్లి గుర్తుచేశారు. ఇలా బయట పార్టీలనుండి లాక్కున్న వాళ్ళకే కేసీయార్ అగ్రపీఠం వేయటంతోనే కొంప ముణగిందన్నారు. వాళ్ళకే మంత్రిపదవులతో పాటు టాప్ ప్రయారిటి ఇవ్వటంతో ఉద్యమకారులకు తీరని అన్యాయం జరిగిందన్నారు.

పాలకుర్తిలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఓటమి ఎప్పుడో జనాలు ఖాయం చేసినట్లు చెప్పారు. కాకపోతే ఆ విషయాన్ని గుర్తించటానికి కేసీయార్, ఎర్రబెల్లే ఇష్టపడలేదన్నారు. తాను ఇన్చార్జిగా ఉన్న జిల్లాలో ప్రజా వ్యతిరేకత వల్లే పార్టీ ఓడిపోయిన విషయం స్పష్టంగా బయటపడిందన్నారు. ఓడిపోయిన తర్వాత రియలైజేషన్ వస్తే మాత్రం ఏమిటి ఉపయోగమని ఎద్దేవా చేశారు. గ్రౌండ్ లెవల్లోని వాస్తవాలను చెప్పేందుకు ప్రయత్నించినా వినడానికి కేసీయార్ ఏ మాత్రం ఇష్టపడలేదని తక్కెళ్ళపల్లి ఇపుడు చెబుతున్నారు.

ఈయన వ్యవహారం చూస్తుంటే వాస్తవ పరిస్ధితులను చెప్పటానికి తనతో పాటు మరికొందరు ప్రయత్నించినా కేసీయార్ పట్టించుకోలేదన్నట్లే ఉంది. పార్టీ గులుపుపై ఊహాగానాలు ఎక్కువైపోయి వాస్తవాలను మరచిపోయారని చెప్పారు. తక్కెళ్ళపల్లితో పాటు ఓడిపోయిన శంకర్ నాయక్, ఏనుగు రవీందర్ లాంటి వాళ్ళు కూడా పార్టీలో గొడవల వల్లే తాము ఓడిపోయామని బహిరంగంగానే చెబుతున్నారు. పార్టీలో అసంతృప్తులు పెరిగిపోవటమే తమ ఓటమికి కారణమని ఇపుడు అంగీకరిస్తున్నారు. ఇదే విషయాన్ని కేసీయార్ కు చెబతామని ఇపుడు వీళ్ళు చెప్పటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని అర్ధంకావటంలేదు.