జగన్ కు బాలినేని ‘బల’ ప్రదర్శన?

సీఎం జగన్ సమీప బంధువు, మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రావు అలియాస్ వాసు వ్యవహార శైలి కొద్ది రోజులుగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో విభేదాల నేపథ్యంలో జగన్ కు బాలినేని దూరమయ్యారని, రాబోయే ఎన్నికలలో బాలినేనికి టికెట్ దక్కకపోవచ్చు అని పుకార్లు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ మంత్రి పదవి దక్కలేదన్న ఆవేదనలో ఉన్న బాలినేని ఒంగోలు వైసిపిలోనే వర్గ పోరు ఎదుర్కోవాల్సి రావడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వైవీ, బాలినేనిల మధ్య సయోధ్య కుదిర్చేందుకు స్వయంగా సీఎం జగన్ జరిపిన చర్చలు కూడా సఫలం కాలేదని ప్రచారం జరిగింది.

ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా పార్టీపై, జగన్ పై బాలినేని పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు. జగన్ తమను పట్టించుకోవడం లేదన్న భావనలో ఉన్న బాలినేని సొంత పార్టీలోనే కొందరు తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తర్వాత రాజీనామా చేయబోయేది బాలినేని అని ప్రచారం జరుగుతోంది. దానికి తోడు 11 మంది సిట్టింగ్ల స్థానాలను జగన్ మార్చిన నేపథ్యంలో తర్వాత విడుదల కాబోయే రెండో జాబితాలో బాలినేని పేరు కూడా ఉంటుంది అని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తన పుట్టినరోజు సందర్భంగా బాలినేని ఒంగోలులో బల ప్రదర్శన చేయడం సంచలనం రేపింది.

దశాబ్దకాలంగా పుట్టినరోజు వేడుకలను జరుపుకోని బాలినేని ఈసారి వేడుకలను అట్టహాసంగా చేసుకొని తన బలం ఇది అని నిరూపించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే బాలినేని కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఒంగోలు నుంచే పోటీ చేస్తానని, భారీ మెజారిటీతో గెలుస్తానని బాలినేని ధీమా వ్యక్తం చేశారు. ఇక, ఒంగోలు ఎంపీగా మాగుంట పోటీ చేస్తారని, తమ కాంబినేషన్లోనే మరో రెండు, మూడు నెలల్లో ఎన్నికలకు వెళ్ళబోతున్నామని బాలినేని తేల్చి చెప్పారు. తాను ప్రజల కోసం తపించానని, కుటుంబం కోసం ఏనాడు ఆలోచించలేదని ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన కుమారుడికి ఏమీ చేసుకోలేకపోయాను అన్న బాధ ఉందని బాలినేని ఆవేదన వ్యక్తం చేశారు. మాగుంట స్థానంలో ఒంగోలు లోక్ సభ సీటు వైవీ ఆశిస్తున్న నేపథ్యంలో బాలినేని వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

తాను మంత్రిగా ఉండి డబ్బులు తీసుకున్నాను అని అర్థం వచ్చేలాగా బాలినేని ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మరి, ఇటీవల బాలినేని చేస్తున్న వ్యాఖ్యలు, వైవీతో ఉన్న విభేదాలు, వర్గ పోరుల మధ్య మరోసారి ఆయనకు టికెట్ దక్కుతుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఒకవేళ బాలినేనికి జగన్ మొండి చేయి చూపిస్తే ఆయన టిడిపిలో చేరుతారా లేక ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.