పవర్ పాయింటుకు రెడీ అవుతున్నారా ?

పదేళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అప్పులపై అసెంబ్లీ వేదికగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వటానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి రేవంత్ వివిధ శాఖల పనితీరుపై సమీక్షలు చేస్తున్నారు. ఇందులో కూడా రెవిన్యు, ఫైనాన్స్ శాఖల ప్రభావం ఎక్కువగా ఉన్న శాఖలపైనే ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే విద్యుత్ శాఖ, ధరణి పోర్టల్ ను నిర్వహించే ఆర్ధికశాఖ, పరిశ్రమల్లాంటివి కీలకంగా ఉన్నాయి.

ఈ సమీక్షల్లోనే విద్యుత్ శాఖ అప్పులు రు. 85 వేల కోట్లున్నట్లు బయటపడింది. తన పాలనలో విద్యుత్ శాఖ అప్పులపై కేసీయార్ ఎప్పుడూ ప్రకటించింది లేదు. అలాగే ధరణి పోర్టల్లో నాలుగు రోజుల్లో వందల ఎకరాల అక్రమాలు బయటపడ్డాయి. అంటే పోర్టల్ ను అమల్లోకి తెచ్చిన దగ్గర నుండి ఇంకెన్ని వేల ఎకరాల్లో అక్రమాలు జరిగాయో అన్న విషయమై సమీక్షలు చేస్తున్నారు. ఇలాంటి అనేక శాఖల్లో జరిగిన అవకతవకలను రేవంత్ ప్రభుత్వం గుర్తిస్తోంది.

ఇలాంటి శాఖలపై సమీక్షలు పూర్తి చేసిన వెంటనే ఆ మొత్తాన్ని అసెంబ్లీ సమావేశాల్లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ రూపంలో ప్రదర్శించాలని డిసైడ్ అయ్యారు. అసెంబ్లీ వేదికగానే రాష్ట్రం అప్పులు, ఆదాయాలపై సవివరమైన నివేదికను జనాలకు వివరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటిల్లో ఎక్కువగా కేసీయార్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఆర్ధిక దుబారాపైనే ఎక్కువగా రేవంత్ దృష్టిపెట్టారు. అప్పట్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీయార్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తే ఇపుడు రేవంత్ అప్పులు, వాస్తవ పరిస్ధితిపైన ప్రజంటేషన్ ఇవ్వబోతున్నారు.

ఈనెల 14వ తేదీన మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల నాటికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రేవంత్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ బాధ్యత మొత్తాన్ని చీఫ్ సెక్రటరి శాంతికుమారికి అప్పగించినట్లు సమాచారం. అందుకనే చీఫ్ సెక్రటరీ రేవంత్ ఆదేశించిన శాఖల ఉన్నతాధికారులతో సమావేశాలు జరుపుతున్నారు. కేసీయార్ హయాంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని రేవంత్ అండ్ కో ఎప్పటినుండో ఆరోపణలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దాన్నే అసెంబ్లీలో అందరిముందు వివరించబోతున్నారు.