కేసీఆర్ ను పరామర్శించిన రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ జాతీయాధ్యక్షుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ బాత్రూంలో జారిపడి గాయపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో కెసిఆర్ కు శస్త్ర చికిత్స నిర్వహించారు. కేసీఆర్ కు విజయవంతంగా వైద్యులు తుంటి కీలు మార్పిడి ఆపరేషన్ చేశారు. ఈ క్రమంలోనే వాకర్ సాయంతో కేసీఆర్ ను వైద్యులు నడిపించారు. కేసీఆర్ పూర్తిగా కోరుకునేందుకు మరో ఆరు నుంచి ఎనిమిది వారాల సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు.

ఈ నేపథ్యంలోనే యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి కేటీఆర్, వైద్యులను రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ ను పరామర్శించానని, ఆయన క్రమంగా కోలుకుంటున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఆరోగ్యం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీని ఆదేశించినట్లుగా రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని, కోలుకున్న తర్వాత అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నానని రేవంత్ రెడ్డి చెప్పారు.

రాష్ట్రంలో సుపరిపాలన అందించేందుకు కేసీఆర్ సూచనలు కూడా అవసరమని రేవంత్ అన్నారు. ప్రజల పక్షాన అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడాల్సిన అవసరముందని రేవంత్ గుర్తు చేశారు. కేసీఆర్ త్వరలోనే కోలుకొని శాసనసభకు రావాలని ఆయనను కోరానని రేవంత్ అన్నారు. ఏదేమైనా ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి పరామర్శించడం, ఆయన కోలుకొని అసెంబ్లీకి రావాలని ఆకాంక్షించడం తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ ప్రత్యర్థులు అయినప్పటికీ రేవంత్ రెడ్డి హుందాగా వ్యవహరించారని సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే కేసీఆర్ ను రేవంత్ పరామర్శించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.