ప్రొటెం స్పీకర్ గా ఒవైసీ: బీజేపీ ఎమ్మెల్యేలు బాయ్‌కాట్‌

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి శాసన సభ సమావేశాలు మొదలయ్యాయి. ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్ ఒవైసీ చేతుల మీదుగా అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా సీఎం రేవంత్ రెడ్డి మొదట ప్రమాణం చేశారు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, సీతక్క, శ్రీధర్ బాబు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు.

తొలిసారిగా సభలో 51 మంది ఎమ్మెల్యేలు అడుగుపెట్టగా..ఈ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు బాయ్‌కాట్‌ చేసిన సంగతి తెలిసిందే. సనసభ ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ ఉండడంతో తాము ప్రమాణం చేయబోమని రాజాసింగ్, బీజేపీ ఎమ్మెల్యేలు తేల్చి చెప్పేశారు. రేపు అసెంబ్లీ స్పీకర్ ను ఎన్నుకున్న తర్వాత వీరు ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. ఎమ్మెల్యే ప్రసాద్ ను స్పీకర్ గా కాంగ్రెస్ నేతలు ప్రతిపాదించారు. రేపు ఆయన ఎన్నిక లాంఛనమే కానుంది. ఇక, ఎల్లుండి సభలో గవర్నర్ ప్రసంగం ఉండబోతోంది. ఆ మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెబుతూ సభ్యులు తీర్మానం చేయనున్నారు.

అంతకుముందు, ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్ భవన్ లో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి అక్బరుద్దీన్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

మరోవైపు, బీఆర్‌ఎస్‌ ఎల్పీ నేతగా మాజీ సీఎం కేసీఆర్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ భవన్ లో బీఆర్ ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి శాసనసభా పక్ష నేతగా కేసీఆర్ పేరును ప్రతిపాదించగా, తలసాని శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి బలపరిచారు.
శాసనసభా పక్షానికి సంబంధించి మిగిలిన సభ్యుల ఎంపిక బాధ్యతను కేసీఆర్‌కు అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది.