తొలి కేబినెట్ భేటీలో నిర్ణయాలు ఇవే

తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయగా ఆయనతోపాటు 11 మంది మంత్రులతో కొత్త క్యాబినెట్ కొలువుదీరింది. మంత్రులకు శాఖలను కూడా రేవంత్ రెడ్డి కేటాయించారు. ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి టీం తొలి కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసింది.

రేవంత్ అధ్యక్షతన కొలువుదీరిన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలో రెండు హామీలను మొదలు పెట్టాలని తీర్మానించింది. కేబినెట్ భేటీలో తీసుకున్న పలు నిర్ణయాలను మీడియాకు ఆర్థిక శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ బీమా అమలు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.

దాంతోపాటు ఉచిత విద్యుత్ హామీపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే రేపు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారని శ్రీధర్ బాబు మీడియా సమావేశంలో వెల్లడించారు‌. ఈనెల తొమ్మిదో తారీకున కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసన సభలో ప్రమాణ స్వీకారం చేస్తారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి అసెంబ్లీ సమావేశం ఆరోజే జరగబోతుందని అన్నారు. సీనియర్ శాసనసభ్యుడిని ప్రొటెం స్పీకర్ గా ఎన్నుకుంటామని శ్రీధర్ బాబు చెప్పారు. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో 6 గ్యారెంటీల అమలుపై చర్చించామని శ్రీధర్ బాబు వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన ఖర్చులపై శ్వేత పత్రం విడుదల చేయాలని నిర్ణయించామని చెప్పారు.