స్పీడ్ పెంచిన రేవంత్.. మార్పు ప్రజలకు తెలిసేలా!

ఒకటి తర్వాత ఒకటి చొప్పున వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మార్పు నినాదాన్ని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బలంగా వినిపించిన కాంగ్రెస్ అందుకు తగ్గట్లే తాను అధికారంలోకి వచ్చిన వేళ.. చకచకా నిర్ణయాల్ని తీసుకుంటోంది. పదేళ్లుగా చూస్తున్న కొన్ని అంశాల్ని రాత్రికి రాత్రి మార్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాంటి ఆసక్తికర పరిణామాలు ఒకటో.. రెండో కాకుండా అంతకు మించి అన్నట్లుగా సాగుతున్నాయి.

ప్రభుత్వం మారి.. ముఖ్యమంత్రిగా రేవంత్ అధికారంలోకి వచ్చే నాటికే ఈ మార్పు తెలంగాణ ప్రజలకు తెలియజేసేలా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా ముగిసిన ఎన్నికల్లో కేసీఆర్ సర్కారుకు అహంకారం ఎక్కువైందని.. అధికారం తలకు ఎక్కిందన్న ప్రచారం విపరీతంగా సాగింది. అధికారాన్ని దర్పంగా కాకుండా బాధ్యతగా తీసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు రేవంత్ రెడ్డి సంకేతాలు పంపుతున్నారు. ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణస్వీకారం చేయటానికి ముందే పలు అంశాలకు సంబంధించిన నిర్ణయాలు చకచకా సాగుతున్నాయి. అందులో ముఖ్యమైనవి.

  • కొద్ది గంటల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న నేతకు.. అధికారిక కాన్వాయ్ ను అధికారులు ఏర్పాటు చేస్తుంటారు. అయితే.. అందుకు రేవంత్ విముఖత వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయనకు.. కాన్వాయ్ ను ఏర్పాటు చేయగా.. అందుకు నో చెప్పిన రేవంత్.. తన సొంత వాహనాల్లో వెళ్లిపోయారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయలేదని.. కాన్వాయ్ వద్దని చెప్పేశారు. అయితే.. కాబోయే సీఎంకు భద్రతను కల్పించాల్సిన బాధ్యత తమకు ఉందన్నపోలీసులు అధికారులు.. ఖాళీ వాహనాల కాన్వాయ్ ను రేవంత్ ప్రైవేటువాహనంతో అనుసరించారు.
  • ఎన్నికల ఫలితాలు వెల్లడైన రోజునే.. ప్రగతి భవన్ ను అంబేడ్కర్ భవన్ గా మారుస్తామని చెప్పటం తెలిసిందే. అంతేకాదు.. తాజాగా ప్రగతి భవన్ కు వెళ్లేందుకు వీలుగా బేగంపేట ప్రధాన రోడ్డును కుదించి.. ప్రత్యేక బారికేడ్లను ఏర్పాటు చేయటం తెలిసిందే. ఈ బారికేడ్లను తక్షణమే తొలగించాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి.
  • తెలంగాణ సచివాలయాన్ని తన అభిరుచికి తగ్గట్లు నిర్మించిన కేసీఆర్.. దాన్ని ప్రారంభించే సమయంలో మీడియా ప్రతినిధులకు పరిమితులు పెట్టటం.. ఎవరైనా అనుమతి ఇస్తే తప్పించి.. లోపలకు వచ్చేందుకు వీల్లేని విధంగా ఆదేశాలు జారీ చేయటం తెలిసిందే. తమ ప్రభుత్వం ఏర్పాటు కాకముందే.. సచివాలయంలోని కింది బ్లాక్ లో మీడియాకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసేలా ఆదేశాలు వచ్చేశాయి.
  • తనకు అధికారిక నివాసం అక్కర్లేదని.. ఇప్పుడు ఉంటున్న ఇంటిలోనే ఉండాలని చెప్పటం ద్వారా.. తన నివాసానికి భారీ హంగులున్న రాజమహాల్ లాంటి ఇల్లు అక్కర్లేదని.. ఇప్పుడు ఉంటున్న ఇల్లు సరిపోతుందన్న విషయాన్ని తేల్చేశారు రేవంత్.
  • తమకు నచ్చని వారికి ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చేందుకు ససేమిరా అన్నట్లు వ్యవహరించిన కేసీఆర్ సర్కారుకు భిన్నంగా.. తాజాగా రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారోత్సవం.. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రభుత్వ ప్రకటనను మిగిలిన దిన పత్రికలతో పాటు.. కేసీఆర్ కుటుంబానికి చెందిన నమస్తే తెలంగాణకు జాకెట్ యాడ్ ఇవ్వటం ఆసక్తికరంగా మారింది.