ఖ‌ర్చులేని నిర్ణ‌యాలు.. రేవంత్‌కు ప్ర‌జాభిమానాలు..!

కొన్ని కొన్ని నిర్ణ‌యాలు.. నాయ‌కుల‌కు ఇట్టే ఆద‌ర‌ణ తీసుకువ‌స్తాయి. వాటికి పెద్ద‌గా ఖ‌ర్చు చేయాల్సిన అవ‌స‌రం కూడా ఉండదు. కావాల్సింద‌ల్లా నేర్పు.. ఓర్పు మాత్ర‌మే. ఉదాహ‌ర‌ణ‌కు.. గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఉమ్మ‌డి రాష్ట్ర సీఎంగా ఉన్న‌ప్పుడు.. ప్ర‌జాద‌ర్బార్ నిర్వ‌హించేవారు. ఇది నిరంత‌రం సాగింది. దీనికి ప్ర‌జ‌ల నుంచి విశేష ఆద‌ర‌ణ కూడా వ‌చ్చింది. అయితే.. త‌ర్వాత వ‌చ్చిన ముఖ్య‌మంత్రులు ఈ కార్య‌క్ర‌మాన్ని కొన‌సాగించ‌లేక పోయారు. ఇక‌, వైఎస్‌లో మ‌రో ల‌క్ష‌ణం కూడా ఉండేది. ఆయ‌న ప్ర‌తి విష‌యంలోనూ జోక్యం చేసుకునేవారు కాదు.

ప్ర‌తి ఫైల్‌ను ప‌ట్టిప‌ట్టి చూసేవారు కాదు. ఉన్న‌తాధికారుల స్వేచ్ఛ‌కు భంగం క‌లిగించ‌డం.. వారిని అనుమానించ‌డం.. లేదా త‌న దారిలో తిప్పుకోవాల‌న్న ప్ర‌య‌త్నాలు కూడా చేయ‌లేదు. ప‌లితంగా అధికారుల నుంచి కూడా వైఎస్ ప్ర‌శంసలు అందుకున్నా రు. దీంతో పాల‌న స‌జావుగా సాగి.. అన్ని శాఖల అధికార వ‌ర్గాల నుంచి ప్ర‌భుత్వానికి పూర్తిస్థాయిలో స‌హకారం ల‌భించింది. ఇక‌, ఏడాది కింద‌ట‌.. త‌మిళ‌నాడు ప‌గ్గాలు చేప‌ట్టిన డీఎంకే చీఫ్ స్టాలిన్ కూడా.. ఇదే కోవ‌లో ప్ర‌జ‌ల అభిమానాన్ని చూర‌గొన్నారు. గ‌త ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను కొన‌సాగించ‌డంతోపాటు.. సాధార‌ణ నాయ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ప్ర‌తి రోజూ తమిళ‌నాడులోనూ ప్ర‌జాద‌ర్భార్ నిర్వ‌హిస్తున్నారు. ఇది సీఎంగా స్టాలిన్ పేరును మ‌రింత పెంచుతోంది. ఇలానే తెలంగాణ‌లో ముఖ్య‌మంత్రిగా ప‌గ్గాలు చేప‌ట్ట‌నున్న రేవంత్ రెడ్డి కూడా చిన్న చిన్న ప్ర‌య‌త్నాల‌తో ప్ర‌జ‌ల గుండెల్లో చోటు సంపాయించుకునే అవ‌కాశం ఉంద‌ని మేధావులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. “ప‌దేళ్ల పాటు రాష్ట్రంలో సీఎంను చూడాలంటే అదో పెద్ద ప్ర‌హ‌స‌నం. సామాన్యుల‌కు అంద‌ని నాయ‌కుడిగా ఆయ‌న వ్య‌వ‌హ‌రించారు. ఇప్పుడు ఆ మ‌చ్చ‌ను తొల‌గించే ప్ర‌య‌త్నం చేయాలి. పార్టీ ఇచ్చిన హామీ మేర‌కు.. ప్ర‌జ‌ల సీఎంగా రేవంత్ పేరు తెచ్చుకునే ప్ర‌య‌త్నం చేయాలి” అని మేధావులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

అంతేకాదు.. ప్ర‌జ‌ల గ‌ళాన్ని వింటాన‌ని ఆయ‌నే స్వ‌యంగా హామీ ఇచ్చారు. నిర‌స‌న‌లు, ఉద్య‌మాల‌పై అణిచివేత ధోర‌ణి ఉండ‌ద ని.. ప్ర‌జాస్వామ్యం తీసుకువ‌స్తాన‌ని… దొర‌ల పాల‌న కాదు.. తెలంగాణ ప్ర‌జ‌ల పాల‌న‌ను తీసుకువ‌స్తామ‌ని చెప్పిన‌ట్టుగానే ఆయన సామాన్య ప్ర‌జానీకాన్ని ఆట్టుకునేందుకు వంద‌ల వేల కోట్ల రూపాయ‌లు వెచ్చించాల్సిన అవ‌స‌రం లేద‌ని.. చిన్న చిన్న మార్పుల‌తో ప్ర‌జ‌ల హృద‌యాలు కొల్ల‌గొట్ట‌వ‌చ్చని చెబుతున్నారు. ప్ర‌జ‌ల‌కు చేరువ‌గా ఉండ‌డం.. వారి క‌ష్టాలు విన‌డం.. ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేయ‌డం.. ప్రెండ్లీ పోలీసింగ్ వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయ‌డం.. ఆరోగ్య‌శ్రీని మ‌రింత బ‌లోపేతం చేయ‌డం వంటి.. ఖ‌ర్చులేని ప‌నుల ద్వారా ప్ర‌జ‌ల‌మ‌న‌సులు కొల్ల‌గొట్ట‌డం ద్వారా ప‌దికాలాల పాటు రేవంత్ ప‌దిలంగా ఉండొచ్చ‌ని అంటున్నారు.