అక్క‌డ రేవంత్‌.. ఇక్క‌డ చంద్ర‌బాబు వ‌స్తే!

తెలంగాణ‌లో జ‌రిగిన‌ తాజా ఎన్నిక‌ల్లో అధికారం ద‌క్కించుకున్న కాంగ్రెస్ పార్టీ వివేక‌వంత‌మైన నిర్ణ‌యం తీసుకుంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఎప్పుడొచ్చావ‌న్న‌ది కాదు.. ఎంత బ‌లంగా ప‌నిచేశార‌న్న‌ది ప్ర‌ధాన మ‌న్న సూత్రీక‌ర‌ణే ప్రామాణికంగా తీసుకున్న కాంగ్రెస్‌ పార్టీ ఈ క్ర‌మంలో పార్టీని అన్ని విధాలా గ‌ట్టెక్కించిన రేవంత్ రెడ్డికే ప‌గ్గాలు అప్ప‌గించి.. సీఎం పీఠంపై కూర్చో బెట్టింది. ఇది యువ‌త‌ను, ముఖ్యంగా మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌ను కూడా ఆక‌ర్షించిన అంశం. సో.. మొత్తానికి తెలంగాణ‌లో రేవంత్‌రెడ్డి ముఖ్య‌మంత్రి అయిపోయారు.

ఇక‌, ఇప్పుడు మ‌రో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సోష‌ల్ మీడియా వేదిక‌గా జ‌రుగుతోంది. రేవంత్‌కు రాజ‌కీయంగా అవ‌కాశం క‌ల్పించిన చంద్ర‌బాబు.. ఏపీలో అధికారంలోకి వ‌స్తే.. ఎలా ఉంటుంది? అనేది ప్ర‌ధాన చ‌ర్చ‌. దీనికి హేతువు కూడా ఉంది. రెండు రాష్ట్రాల మ‌ధ్య అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి. జ‌ల వివాదాల నుంచి విద్యుత్ స‌మ‌స్య‌లు, ఉద్యోగుల వివాదాలు, విభ‌జ‌న సంస్థ‌లు, ప్రాజెక్టుల నిర్మాణం.. వంటి అనేక విష‌యాల్లో స‌మ‌స్య‌లు అలానే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో వీటి ప‌రిష్కారానికి గ‌తంలో చంద్ర‌బాబు హ‌యాంలో కొంత ప్ర‌య‌త్నం అయితే జ‌రిగింది.

అయితే.. తెలంగాణ‌లో కేసీఆర్ స‌ర్కారు ఉండ‌డంతో ఆ చ‌ర్చ‌లు ముందుకు సాగ‌లేదు. త‌ర్వాత‌.. ఏపీలో ప్ర‌భుత్వం మారి.. సీఎం జ‌గ‌న్ వచ్చినా.. కేసీఆర్ ఆయ‌న‌కు మిత్రుడ‌నే ప్ర‌చారం ఉన్నా.. రాష్ట్రాల స‌మ‌స్య‌లు ముందుకు సాగ‌క‌పోగా.. మ‌రింత‌గా పెరిగాయ‌నే వాద‌న ఉంది. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలే ప్ర‌ధానంగా ప‌నిచేసుకున్నార‌ని.. అటు ఇటు, రాష్ట్రాల ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శించిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఏపీకి సంబందించిన స‌మ‌స్య‌లు.. తెలంగాణ అంశాలు.. ఈ రెండు కూడా ముడి ప‌డ‌కుండా అలానే ఉన్నాయి. దీంతో ఇప్పుడైనా ప‌రిస్థితి మారాల‌నేది మెజారిటీ ప్ర‌జ‌ల అభిప్రాయం.

తెలంగాణ‌లో రేవంత్ అధికారంలోకి రావ‌డం.. కాంగ్రెస్ నాయ‌కులు కూడా.. ఏపీ విష‌యంలో సానుకూలంగా ఉన్న నేప‌థ్యంలో ఏపీలో చంద్ర‌బాబు వ‌స్తే.. మ‌రింత సానుకూల‌త ఏర్ప‌డి.. స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అయ్యే దిశ‌గా ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుందని మెజారిటీ వ‌ర్గాలు బావిస్తున్నారు. పైగా రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య ఉన్న ఇగో ప్రాబ్లెమ్స్ కూడా త‌ప్పుతాయ‌ని అంటున్నారు. చంద్ర‌బాబు అంటే.. రేవంత్‌కు ఉన్న గౌర‌వం.. రేవంత్ త‌న వాడేనన్న అభిమానం చంద్ర‌బాబుకు ఉన్న నేప‌థ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మార్పులు త‌థ్య‌మ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.