‘చ‌లో ఢిల్లీ’.. కాంగ్రెస్‌పై కేటీఆర్ వ్యాఖ్య‌లు

తెలంగాణలో ప‌దేళ్ల సుదీర్ఘ నిరీక్ష‌ణ అనంత‌రం.. రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. అయితే.. ఫ‌లితం వెల్ల‌డైన వెంట‌నే ముఖ్య‌మంత్రి పీఠాన్ని అప్ప‌గించేస్తార‌ని, దీంతో కాంగ్రెస్‌పై ఉన్న ముఖ్య‌మంత్రి ఎంపిక‌లో తర్జ‌న భ‌ర్జ‌న అనే అప‌వాదు తొలుగుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే.. తెలంగాణ‌లోనూ అది సాధ్యం కాలేదు. క్షేత్ర‌స్థాయిలో తెలంగాణ నేత‌లను కూర్చోబెట్టి చ‌ర్చించినా.. ఫ‌లితం క‌నిపించ‌లేదు. దీంతో ఎట్ట‌కేల‌కు ఢిల్లీ పెద్ద‌లు జోక్యం చేసుకున్నారు. ఢిల్లీ స్థాయిలోనే నిర్ణ‌యం తీసుకున్నారు. మొత్తానికి రేవంత్ ను సీఎం సీటులో కూర్చోబెట్టారు.

అయితే.. కాంగ్రెస్ పార్టీ నేత‌లు తెలంగాణ‌లో అధికారంలోకి వ‌స్తే.. ఎలాంటి నిర్న‌యం తీసుకోవాల‌న్నా.. వారు ఢిల్లీకి వెళ్లాల్సిందే నంటూ.. మాజీ మంత్రి, బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీ వేదిక‌గా చేసిన ప్ర‌సంగం వెనువెంట‌నే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేత‌ల‌ను ఏకేశారు. “కాంగ్రెస్ నేత‌లు వాష్‌రూమ్‌కు వెళ్లాల‌న్నా.. చ‌లో(వెన‌కాల బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు ఢిల్లీ అని నినాదాలు చేశారు), గ‌ల్లిలో రోడ్డు వేయాల‌న్నా చ‌లో, దానిపై కొట్టాట వ‌చ్చి నాయ‌కులు క‌ల‌బ‌డ్డా.. చ‌లో, మేనిఫెస్టో త‌యారు చేయాల‌న్నా చ‌లో, వాగ్దానాలునెర‌వేర్చాల‌న్నా చ‌లో.. హామీలు ఇవ్వాల‌న్నా చ‌లో.. ఏదైనా ఫైలుపై సంత‌కం చేయాల‌న్నా చ‌లో.. ఇదీ కాంగ్రెస్ నేత‌ల ప‌రిస్థితి ” అంటూ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

క‌ట్ చేస్తే.. ఈ ప‌రిస్థితిని త‌ప్పించేందుకు పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి అనేక ప్ర‌యత్నాలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రాగానే ఆయ‌న స్వ‌యంగాకొన్ని నిర్ణ‌యాలు తీసుకుని అధికారుల‌కు పాస్ చేశారు. కానీ, సీఎం ఎంపిక విష‌యంలో మాత్రం 48 గంటల పాటు అధిష్టానం.. నిర్ణ‌యం తీసుకునే వ‌ర‌కు సందిగ్ధ‌త ఏర్ప‌డ‌డం.. ఢిల్లీ వ‌ర‌కు ఈ విష‌యం వెళ్ల‌డం.. వంటి ప‌రిణామాల‌తో మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లే నిజ‌మ‌వుతున్నాయంటూ.. సోష‌ల్ మీడియాలో కామెంట్లురావ‌డం గ‌మ‌నార్హం.