ఆరు ఎంఎల్సీలు ఖాళీయా ?

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ఏర్పడగానే ఆరు ఎంఎల్సీ ఖాళీలను భర్తీ చేయబోతోంది. రెండు స్ధానాలు ఇప్పటికే ఖాళీగా ఉండగా దీనికి అదనంగా మరో నాలుగు స్ధానాలు ఖాళీలు కాబోతున్నాయి. కారణం ఏమిటంటే ఎంఎల్సీలుగా ఉన్న నలుగురు నేతలు ఎంఎల్ఏలుగా పోటీచేసి గెలవటమే. ఈ నలుగురిలో ముగ్గురు బీఆర్ఎస్ నుండి ఒకరు కాంగ్రెస్ నుండి గెలిచారు. అంతకుముందే రెండు స్ధానాలు ఖాళీగా ఉన్నాయి. సో మొత్తం మీద ఆరు స్ధానాలను భర్తీ చేసే అవకాశం వచ్చింది.

ఇపుడు ఖాళీ అవుతున్న ఎంఎల్సీలన్నీ బీఆర్ఎస్ ఖాతాలోనేవి. మహబూబ్ నగర్ స్ధానిక సంస్ధల నుండి బీఆర్ఎస్ తరఫున కసిరెడ్డి నారాయణరెడ్డి గెలిచారు. అయితే టికెట్ దక్కలేదని కాంగ్రెస్ లోకి జంప్ చేసి టికెట్ తెచ్చుకుని గెలిచారు. అలాగే ఎంఎల్ఏ కోటాలో పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి, నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల స్ధానం నుండి ఎంఎల్సీలైన పల్లా రాజేశ్వరరెడ్డి తాజా ఎన్నికల్లో ఎంఎల్ఏలుగా గెలిచారు. కాబట్టి ఈ నలుగురు ఎంఎల్సీలుగా రాజీనామాలు చేయటం ఖాయం. దీనికి అదనంగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను ప్రతిపాదిస్తు గతంలోనే కేసీయార్ ప్రభుత్వం పంపిన ఫైలు గవర్నర్ దగ్గరే పెండింగులో ఉంది. అంటే మొత్తం ఆరు స్ధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేయాల్సుంటుంది.

ఎన్నికల ప్రక్రియ ఊపందుకున్న తర్వాత బీఆర్ఎస్, బీజేపీల నుండి కాంగ్రెస్ లోకి కొందరు సీనియర్లు కాంగ్రెస్ లో చేరారు. టికెట్లు ఇవ్వలేకపోతున్న కారణంగా కొందరికి అధిష్టానం రకరకాల పదవులను హామీలిచ్చింది. ఇందులో ఎంఎల్సీ పదవులు కూడా ఉన్నాయి.

ఇపుడెలాగు ఆరు స్ధానాలను భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి లోకల్ బాడీ, పట్టభద్రులను వదిలేస్తే మిగిలిన రెండు స్ధానాలను డైరెక్టుగా కాంగ్రెస్ గెలిచే అవకాశముంది. ఇంకో రెండింటిని గవర్నర్ కోటాలో భర్తీ చేయాలి. అంటే స్ట్రైట్ గా నాలుగు కాంగ్రెస్ ఖాతాలో పడతాయి. కాబట్టి ఈ నాలుగింటి కోసం పార్టీలో ప్రయత్నాలు పెరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఎవరికి దక్కుతుందో చూడాల్సిందే.