కేటీఆర్‌ను మ‌రిపించే మంత్రి ఎవ‌రో? ఐటీ వ‌ర్గాల గుస‌గుస‌!

తెలంగాణలో ఐటీ రంగం విస్త‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా హైద‌రాబాద్‌, సైబ‌రాబాద్‌తోపాటు.. గ‌చ్చిబౌలి వంటి కీల‌క ప్రాంతాల్లో ఐటీ విస్త‌ర‌ణ జోరుగా సాగుతోంది. కేసీఆర్ స‌ర్కారు అనేక సంస్త‌ల‌ను కూడా ఆహ్వానించింది. ఈ క్ర‌మంలో మంత్రి కేటీఆర్ కీల‌క పాత్ర పోషించారు. ఐటీ,ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రిగా ఆయ‌న ఒక ముద్ర వేశారు. నిరంత‌రం ఐటీ ఉద్యోగుల‌తో ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా ట‌చ్‌లో కూడా ఉండేవారు. దీంతో ఆయ‌న‌కు ‘ఫ్రెండ్లీ మినిస్ట‌ర్‌’ అనే పేరు కూడా వ‌చ్చింది.

అయితే.. ఇప్పుడు స‌ర్కారు మారిన నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌నుంది. దీంతో ఎవ‌రు ఐటీ శాఖ‌ను చేప‌ట్ట‌నున్నారు? ఎవరు నాటి మంత్రి కేటీఆర్ స్థాయిలో దూకుడు ప్ర‌ద‌ర్శించ‌నున్నారు? ఆయ‌న‌ను మ‌రిపించ‌నున్నారు? అనే చ‌ర్చ ఐటీ వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది. అంతేకాదు, గత పదేళ్లుగా ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ అద్భుత సేవలు అందించారని.. ఇప్పుడు ఆయన స్థానాన్ని భర్తీ చేసే నాయకుడు ఎవరంటూ సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్‌ను మిస్ అవుతామని పలువురు కామెంట్ చేస్తున్నారు.

కొందరు బీఆర్ఎస్ అభిమానులు అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగా పనిచేయాలంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. రాజకీయాలను పక్కన పెడితే కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగా బాగానే పనిచేశారని.. ఐటీ కంపెనీలను తేవడంలో, సైబరాబాద్ పరిధిలో అభివృద్ధి విషయంలో కేటీఆర్ పనితీరు ఎంతో మెచ్చుకోదగ్గ విధంగా ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక‌, ఇప్పుడు కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో ఎవ‌రు ఐటీ శాఖ మంత్రి అవుతార‌నేది ఆస‌క్తిగా మారింది. గ‌తంలో ఐటీ మంత్రిగా కోమ‌టి రెడ్డి వెంక‌ట రెడ్డి చేశారు. ఇక‌, ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న మంత్రి వ‌ర్గ ముసాయిదా జాబితాలోనూ ఐటీ శాఖ‌ను ఆయ‌న‌కే కేటాయించిన‌ట్టు తెలుస్తోంది.

ఇదే స‌మ‌యంలో దుద్దిళ్ల శ్రీధర్‌బాబు లేదా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఐటీ శాఖ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని కూడా పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌సాగుతోంది. మొత్తంగా చూసుకుంటే కేటీఆర్ స్థాయిలో మాట్లాడే సత్తా, సైబరాబాద్ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం ఎవరికి ఉన్నాయా అంటూ మాట్లాడుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మ‌రి ఎవ‌రికి ఐటీ ప‌గ్గాలు ద‌క్కుతాయో చూడాలి.