బండిని కాద‌ని.. బీజేపీ పావుకున్న‌దేంటి?

కీల‌క నాయ‌కుడు.. పార్టీని ప‌రుగులు పెట్టించిన ఫైర్ బ్రాండ్‌ను ప‌క్క‌న పెట్టిన బీజేపీ.. దానికి సంబంధించిన మూల్యాన్ని అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చెల్లించుకుంద‌నే టాక్ వినిపిస్తోంది. వాస్త‌వానికి 2018లో పార్టీకి ఏమీలేదు. కేవలం ఒకే ఒక్క‌స్థానం .. ఘోషా మ‌హ‌ల్ నుంచి రాజాసింగ్ గెలుపు త‌ప్ప‌.. ఇంకేమీ లేదు. అలాంటి క‌మ‌లం పార్టీని.. పుంజుకునేలా చేసింది బండి సంజ‌య్‌. మూడు ప్ర‌ధాన ఉప ఎన్నిక‌లు, కీల‌క‌మైన హైద‌రాబాద్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో పార్టీని ఒడ్డుకు చేర్చారు.

రాష్ట్రంలో ప్ర‌త్యామ్నాయ పార్టీగా.. బండి సంజ‌య్ బీజేపీని నిల‌ప‌గ‌లిగారు. ఒకానొక ద‌శ‌లో కాంగ్రెస్‌ను ఓవ‌ర్ టేక్ చేసేసి.. బీఆర్ఎస్‌కు తామే ప్ర‌త్యామ్నాయ‌నే టాక్‌ను కూడా తీసుకువ‌చ్చిన ఫైర్ బ్రాండ్‌. ఈ క్ర‌మంలో పార్టీని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు ఆయ‌న ప్ర‌జా సంగ్రామ యాత్ర‌కు శ్రీకారం చుట్టారు. అనేక ఇబ్బందులు ప‌డ్డారు. అనేక కేసులు కూడా పెట్టించుకున్నారు. అయితే.. తీరా అసెంబ్టీ ఎన్నిక‌ల ముంగిట‌.. ఆయ‌న‌ను పార్టీ అధిష్టానం ప‌క్క‌న పెట్టేసింది.

తెర‌వెనుక వ్యూహం ఏముందో.. కానీ, బీజేపీ త‌ర‌ఫున మాట్లాడే ఫైర్‌బ్రాండ్ లేకుండా పోయింది. ప‌లితం.. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ చ‌తికిల ప‌డిపోయింది. దుబ్బాక వంటి ప్ర‌తిష్టాత్మ‌క నియోజ‌క‌వ‌ర్గంలోనూ బీజేపీ త‌న స‌త్తా చాట‌లేక‌పోయింది. ఇక‌, హుజూరాబాద్‌లోనూ గెలుపు క‌ష్ట‌మ‌నే వాద‌న వినిపిస్తోంది. 119 స్థానాల్లో 118 చోట్ల అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టిన బీజేపీ.. కేవ‌లం 8 స్థానాల్లో మాత్రమే సాధించిందటే.. దీనిని ఏమ‌నాలి?!

ఎదుగుతున్న ద‌శ‌లో కీల‌క నేత‌కు చెక్ పెట్ట‌డం ద్వారా తెలంగాణలో బీజేపీ త‌న ఉనికిని తానే చిదిమేసుకున్న‌ట్టు అయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప‌రిస్థితి దారుణంగా ఉంది. ఇలాంటి స‌మ‌యంలో బండి వంటి ఫైర్ బ్రాండ్ క‌మ‌ల వికాసానికి ప్రాధాన్యం ఇస్తున్నార‌నే టాక్ వ‌చ్చింది. కానీ, ఆయ‌న‌ను అనూహ్యంగా త‌ప్పించి.. బీజేపీ త‌న గోతిని తానే త‌వ్వుకుంద‌ని ఇప్పుడు ఫ‌లితం స్ప‌ష్టం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.