గులాబీ వాడిపోయింది!

ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కాంగ్రెస్ కు పట్టం కట్టగా…బీఆర్ఎస్ నేతలు ఎగ్జాక్ట్ పోల్స్ ను నమ్ముకుంటున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తొలి రౌండ్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడంతో గులాబీ శ్రేణులు షాక్ అయ్యాయి. రెండో రౌండ్ పూర్తి అయ్యే సరికి 59 స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉండగా…34 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

కొడంగల్ లో 4 వేల మెజారిటీతో టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లీడ్ లో ఉన్నారు. గజ్వేల్ లో సీఎం కేసీఆర్ ఆధిక్యంలో ఉన్నారు. కామారెడ్డిలో రేవంత్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపు అన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉండడం బీఆర్ఎస్ శ్రేణులను కలవరపెడుతుంది. ఇక. మధిరలో భట్టి విక్రమార్క ముందంజలో ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 8 చోట్ల కాంగ్రెస్ ఒకచోట సిపిఐ ముందంజలో ఉంది. ఇక, సనత్ నగర్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముందంజలో కొనసాగుతున్నారు. కొల్హాపూర్ లో జూపల్లి 1300 మెజారిటీతో ముందంజలో కొనసాగుతున్నారు.

నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మూడువేల ఓట్ల మెజారిటీతో ముందంజలో కొనసాగుతున్నారు. ఇక, ఖమ్మంలో తుమ్మలకు 300 ఓట్ల ఆదిక్యం లభించింది. ఖైరతాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ ముందంజలో కొనసాగుతున్నారు. సిద్దిపేటలో హరీష్ రావు ముందంజలో కొనసాగుతున్నారు. ఓవరాల్ గా మొదటి రెండు రౌండ్ల ఫలితాలు ముగిసే సమయానికి కాంగ్రెస్ మెజారిటీ స్థానాల్లో ముందంజలో కొనసాగుతుండగా బీఆర్ఎస్ వెనుకబడింది.

ఇవే ఫలితాలు చివరి రౌండ్ వరకు కొనసాగుతాయని కాంగ్రెస్ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అభ్యర్థులు బసచేసిన తాజ్ కృష్ణ హోటల్ వద్ద సందడి ఏర్పడింది. ఇప్పటికే కర్ణాటక నుంచి వచ్చిన కాంగ్రెస్ పెద్దలు అభ్యర్థుల వెంట ఉన్నారు. విజయం తమదేనని కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ధీమా వ్యక్తం చేస్తూ సంబరాలకు సిద్ధమవుతున్నాయి.