సీఎంగా రేవంత్ రెడ్డి.. ఎంత మంది జై కొట్టారంటే!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుంటుంద‌నే భావ‌న‌తో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ముఖ్య‌మంత్రి ఎవ‌రు అవుతారు? అధికార పీఠం ఎవ‌ర ద‌క్కించుకుంటార‌నే చ‌ర్చ సాగుతోంది. ఇప్ప‌టికే పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స్వ‌యంగా ఈ సీటు కోసం 12 మంది నాయ‌కులు పోటీ ప‌డుతున్నార‌ని వెల్ల‌డించి బాంబు పేల్చారు. ఈ ఏడాది క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెలిచినా.. అక్క‌డ ఇద్ద‌రు మాత్ర‌మే సీఎం సీటుకోసం పోట్లాడుకున్నారు. కానీ, దాదాపు ప‌దేళ్ల విరామం త‌ర్వాత‌.. తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం ద‌క్కించుకుంద‌ని స‌ర్వేలు చెబుతున్న వేళ‌.. ఇక్క‌డ ముఖ్యమంత్రి పీఠంపై ఎంతో మంది ఆశ‌లు పెట్టుకున్నారు.

ఇదేవిష‌యంపై గురువారం ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం.. ప్ర‌ముఖ స‌ర్వే సంస్థ, మీడియా అగ్ర సంస్థ‌.. ‘ఇండియా టుడే’ జ‌నంలోకి వెళ్లింది. తెలంగాణ స‌మాజంలో ఉన్న అభిప్రాయాల‌ను వెతికి ప‌ట్టుకుంది. దీని ప్ర‌కారం.. కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే.. ఎవ‌రు ముఖ్య‌మంత్రి అయితే బాగుంటుంద‌ని నేరుగా తెలంగాణ ప్ర‌జ‌ల‌ను ఇండియా టుడే ప్ర‌శ్నించింది. దీనికి ప్ర‌జ‌లు బాగానే రియాక్ట్ అయ్యారు. సుమారు 21 శాతం మంది రేవంత్‌రెడ్డి ముఖ్య‌మంత్రి అయితే బాగుంటుంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఇదేస‌మ‌యంలో మ‌రొక శాతం ఎక్కువ‌గా అంటే.. 22 శాతం మంది ప్ర‌జ‌లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవ‌రు ముఖ్య‌మంత్రి అయినా.. త‌మ‌కు బాగానే ఉంటుంద‌ని చెప్ప‌డం విశేషం.

ఇక‌, బీఆర్ ఎస్ నుంచి ఎవ‌రు ముఖ్య‌మంత్రి అయితే బాగుంటుంద‌న్న ఇండియా టుడే ప్ర‌శ్న‌కు 33 శాతం మంది ప్ర‌జ‌లు కేసీఆర్‌కు అనుకూలంగా తీర్పు ఇవ్వ‌గా.. మిగిలిన వారిలో 15 శాతం మంది కేటీఆర్‌కు జైకొట్టారు. ఇక‌, మ‌రో 10 శాతం మంది ఎవ‌రైనా త‌మ‌కు ఓకే అన్న‌ట్టుగా చెప్పుకొచ్చారు. కేటీఆర్ ని ముఖ్య‌మంత్రిని చేయ‌డం కోసమే కేసీఆర్ ఈ ఎన్నిక‌ల్లో చాలా క‌ష్ట‌ప‌డుతున్నార‌న్న బీజేపీ నేత‌ల వ్యాఖ్య‌ల‌ను ఎక్కువ మంది స‌మ‌ర్థించ‌డం.. గ‌మ‌నార్హం. వార‌స‌త్వ రాజ‌కీయాల‌ను ఎక్కువ మంది ప్ర‌జ‌లు స‌మ‌ర్థించారు. అదేవిధంగా యువ‌త రాజ‌కీయాల్లోకి రావాల‌న్న వాద‌న‌కు కూడా మెజారిటీ ప్ర‌జ‌లు జై కొట్టారు.