ఏపీలో వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ ర‌ద్ద‌వుతుందా…?

ఏపీలో వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చింది. అస‌లు ఈ వ్య‌వ‌స్థ ఉంటుందా? ఎన్నిక‌ల స‌మయానికి ర‌ద్ద‌వుతుందా? అదే జ‌రిగితే వైసీపీ నాయ‌కులు ఏం చేయాలి? పార్టీ అధిష్టానం ప్ర‌త్య‌మ్యాయ మార్గాల‌ను అన్వేషిందా? అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. 2019 అక్టోబ‌రులోనే వ‌చ్చిన వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌పై రెండు ర‌కాల చ‌ర్చ‌లు సాగుతున్నాయి. ఒక‌టి దీనిలో పాజిటివ్‌. రెండు నెగిటివ్‌. ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ ప‌థ‌కాలు చేరువ చేయ‌డం.. పాజిటివ్‌.

అంతేకాదు.. నెలనెలా .. సామాజిక పింఛ‌న్ల‌ను.. వ‌లంటీర్లు ఇంటింటికీ పంచుతుండ‌డం.. ఇతర ప‌థ‌కాల‌పైనా ప్ర‌జ‌ల‌ను చైత‌న్యం చేసి ల‌బ్ధిదారులు కార్యాల‌యాల చుట్టూ తిర‌గ‌కుండా.. స‌హ‌క‌రించి.. వారికి మేలు చేయ‌డం.. అనేది పాజిటివ్. దీనిపై ఎవ‌రికీ ఎలాంటి అభ్యంత‌రం లేదు. అయితే.. అస‌లు సిస‌లు అంశం రెండోదే. రాజ‌కీయంగా ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేస్తున్నార‌ని.. వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకును గుర్తించి ఓట‌ర్ల జాబితా నుంచి తీసేస్తున్నార‌నేది.. ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌.

అంతేకాదు.. వైసీపీకి వ‌లంటీర్లు మౌత్ పీస్‌గా మారార‌నేది మ‌రో కీల‌క అంశం. ఈ అంశాలు.. గ‌త మూడేళ్లుగా రాష్ట్రంలో రాజ‌కీయ వివాదంగా మారాయి. మ‌రోవైపు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌.. ఏకంగా.. వ‌లంటీర్ల‌పై ఉమెన్ ట్రాఫికింగ్ అనే ముద్ర వేసేశారు. మ‌హిళ‌ల అదృశ్యం వెనుక వ‌లంటీర్ల పాత్ర ఉంద‌ని చెప్పుకొచ్చారు. దీంతో ఒకానొక ద‌శ‌లో వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌పై స‌మాజంలోనూ వ్య‌తిరేక‌త వ‌చ్చింది. కానీ, దీనిని వైసీపీ ప్ర‌భుత్వం అధిగ‌మించి.. వ‌లంటీర్ల‌ను నిల‌బెట్టింది.

అయితే.. ఇప్పుడు ఈ విష‌యం సుప్రీంకోర్టుకు చేరింది. రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ మాజీ క‌మిష‌న‌ర్ నిమ్మ‌గడ్డ ర‌మేష్‌బాబు.. వలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ.. ఉన్న‌త న్యాయ‌స్థానంలో పిటిష‌న్ వేశారు. వ‌లంటీర్లు ప్ర‌భుత్వానికి చెందిన వారైనా.. వైసీపీకి చెందిన ప‌నులు చేస్తున్నార‌ని, ఓట‌ర్ల జాబితాలో ప్ర‌త్య‌క్షంగా పాల్గొంటున్నార‌ని.. ఇది వ‌చ్చే ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని ఆయ‌న సుప్రీంకోర్టుకు తెలిపారు.

దీంతో ఈ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన కోర్టు వ‌చ్చే నెల‌కు వాయిదా వేసింది. అయితే.. వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి తాత్కాలికంగా అయినా.. స‌స్పెండ్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని న్యాయ‌నిపుణులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో విపత్తును ముందుగానే గుర్తించిన వైసీపీ ప్ర‌భుత్వం గృహ‌సార‌థుల‌ను అలెర్ట్ చేస్తోంది. వీరు పూర్తిగా పార్టీకి చెందిన వారే. వీరికి వ‌లంటీర్ల‌కు ఉన్న అవ‌కాశాలు లేక‌పోయినా.. దాదాపు అంతే రేంజ్‌లో బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని నిర్ణ‌యించింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.