రెండు చోట్ల కుస్తీ.. ఒక్క‌చోటే విజ‌యం.. అగ్ర‌నేతలకు షాక్‌!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేసిన అగ్ర‌నాయ‌కుల‌కు.. ఓట‌ర్లు షాకిచ్చారు. పార్టీల‌కు అతీతంగా నాయ‌కుల‌ను ఓడించేందుకు రెడీ అయిన‌ట్టు స‌ర్వేలు చెబుతున్నాయి. ఈ పార్టీ.. ఆ పార్టీ అనే తేడా లేకుండా.. ప్ర‌జ‌లు రెండేసి స్థానాల్లో పోటీచేసిన నాయ‌కుల‌ను ఒక్క స్థానానికే ప‌రిమితం చేయ‌డం గ‌మ‌నార్హం.

కేసీఆర్‌: రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. తెలంగాణ‌కు ముందు.. త‌ర్వాత కూడా.. కేసీఆర్ ఇలా రెండు చోట్ల నుంచి పోటీ చేయ‌డం అరుదు. ఎప్పుడూ.. సంప్ర‌దాయంగా ఆయ‌న గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలోనే పోటీ చేస్తున్నారు. కానీ, ఎందుకో తేడా కొడుతుంద‌ని ఊహించి.. ఈ సారి కామారెడ్డి నుంచి బ‌రిలో నిలిచారు. కానీ, కామారెడ్డిలోనే ఆయ‌న ఓడిపోతున్నార‌నేది స‌ర్వేల అంచ‌నా. ఇక‌, సంప్ర‌దాయ గ‌జ్వేల్‌లో మాత్రం విజ‌యం ద‌క్కించుకోనున్నారు.

రేవంత్‌రెడ్డి: కాంగ్రెస్ పీసీసీ చీఫ్ అయిన రేవంత్‌రెడ్డి తొలిసారి రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. త‌నకు సంప్ర‌దాయంగా ఉన్న కొడంగ‌ల్ స‌హా.. కామారెడ్డి నుంచి ఆయ‌న బ‌రిలో నిలిచారు. అయితే.. ఈయ‌న‌కు కూడా.. కామారెడ్డి ప్ర‌జ‌లు జై కొట్ట‌లేదు. కేవ‌లం కొడంగ‌ల్‌లో మాత్రం గెలుపు గుర్రం ఎక్క‌నున్నార‌ని.. స‌ర్వేలు చాటిచెబుతున్నాయి. దీంతో ఈయ‌న చేసిన రెండో ప్ర‌య‌త్నం కూడా విఫ‌ల‌మైంది.

ఈట‌ల రాజేంద‌ర్‌: బీజేపీ సీనియ‌ర్ నేత‌, ప్రచార క‌మిటీ క‌న్వీన‌ర్‌కూడా. అయితే..ఈ య‌న కూడా ఈ సారి ఎన్నిక‌ల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేశారు. సంప్ర‌దాయ హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం స‌హా.. సీఎం కేసీఆర్‌ను ఓడించాల‌నే ల‌క్ష్యంతో గజ్వేల్ నుంచి తొలిసారి బ‌రిలో నిలిచారు. అయితే.. హుజూరాబాద్ ప్ర‌జ‌లే ఆయ‌న‌కు జై కొట్టిన‌ట్టు స‌ర్వేలు తేల్చాయి. గ‌జ్వేల్‌లో ఘోర ప‌రాజ‌యం త‌ప్ప‌ద‌ని వెల్ల‌డించాయి. ఈ ముగ్గురి విష‌యం.. రాష్ట్ర ఎన్నికల్లో ఆస‌క్తిగా మారిన సంగ‌తి తెలిసిందే.