‘వై ఏపీ నీడ్స్ జగన్’కు హైకోర్టు బ్రేక్!

‘వై ఏపీ నీడ్స్ జగన్’ అనే కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి మరోసారి జగన్ సీఎం కావాలని, రాష్ట్రానికి జగన్ అవసరం ఎందుకు ఉంది అన్న నినాదంతో వైసీపీ నేతలు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే, ‘వై ఏపీ నీడ్స్’ జగన్ స్లోగన్ పై టీడీపీ సోషల్ మీడియా విభాగం సెటైర్లు కూడా వేసింది. ఏపీకి జగన్ అవసరం లేదు….ఏపీకి జగన్ ఎందుకు? అన్న రీతిలో టీడీపీ సోషల్ మీడియా విభాగం పెట్టిన పోస్టులు వైరల్ గా మారాయి.

అదలా ఉండగానే తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితోపాటు ఏపీ సీఎస్, పలువురు అధికారులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. వారందరికీ ఈ వ్యవహారంపై నోటీసులు జారీ చేసిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. రాజకీయపరమైన ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా మార్చారని మంగళగిరికి చెందిన జర్నలిస్టు కట్టెపోగు వెంకయ్య హైకోర్టును ఆశ్రయించారు.

ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా నియంత్రించాలని తన పిటిషన్ లో పేర్కొన్నారు. సజ్జల సూచనల ప్రకారమే ప్రభుత్వ సిబ్బంది ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారని, సజ్జలతో పాటు సి ఎస్, జీఏడీ సీఎస్, పంచాయతీరాజ్ శాఖ, పురపాలక శాఖ, గ్రామ-వార్డు సచివాలయాల శాఖ, వాలంటీర్ శాఖల ముఖ్య కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు. వైసీపీతో కలిసి ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు పనిచేయాలని మీడియా సమావేశంలో సజ్జల బహిరంగంగా చెప్పారని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.

రాజకీయ లబ్ధితో అధికార పార్టీకి ఓటు వేసేలా ప్రజలను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. జగన్ ను పొగిడేందుకు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారని తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ పిటిషన్ పై విచారణ జరిగిన హైకోర్టు వారందరికీ నోటీసులు జారీ చేసింది. ఓవైపు ఈ కార్యక్రమాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లేందుకు వైసీపీ నేతలంతా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో హైకోర్టు ఇలా నోటీసులు జారీ చేయడం వారికి షాక్ ఇచ్చినట్లయింది.