చంద్రబాబుకు సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్

ఏపీ సర్కారుకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు కేసు విచారణను సుప్రీం కోర్టు ధర్మాసనం డిసెంబరు 8వ తేదీకి వాయిదా వేసింది. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ కార్యకలాపాలు, ర్యాలీల్లో చంద్రబాబు పాల్గొనవచ్చని తెలిపింది. కానీ, తదుపరి విచారణ వరకు కేసు వివరాల గురించి ఇటు చంద్రబాబు, అటు సీఐడీ, ప్రభుత్వం బహిరంగంగా మాట్లాడొద్దని సూచించింది. డిసెంబర్ 8వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఆ కేసులో 17 ఏపై తీర్పు వచ్చిన తర్వాతే చంద్రబాబు బెయిల్ రద్దు కేసు విచారణ జరుపుతామని సుప్రీం స్పష్టం చేసింది. రాజకీయ ర్యాలీలు, సభలు, సమావేశాలూ నిర్వహించకుండా చంద్రబాబును కట్టడి చేయాలన్న సీఐడీ అభ్యర్ధనను సుప్రీం తోసిపుచ్చింది. స్కిల్ కేసు గురించి మాత్రమే చంద్రబాబు బహిరంగంగా వ్యాఖ్యలు చేయకూడదని సుప్రీం తేల్చిచెప్పింది. మధ్యంతర బెయిల్ సమయంలో ఏపీ హైకోర్టు విధించిన షరతులను కొనసాగించాలన్న సీఐడీ అభ్యర్ధనకు సుప్రీం అభ్యంతరం తెలిపింది.

చంద్రబాబుకు బెయిల్‌ మంజూరులో తమ వాదనలు హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని, బెయిల్ రద్దు చేయాలని సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిగింది. హైకోర్టు తన పరిధి దాటి తీర్పులో వ్యాఖ్యలు చేసిందని.. వెంటనే చంద్రబాబు బెయిల్‌ రద్దు చేయాలని ప్రభుత్వం తరఫున ఏఏజీ పొన్నవోలు వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన కొలమానాలను హైకోర్టు అతిక్రమించిందని, కేసు లోతుల్లోకి వెళ్లి క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. ట్రయల్ కోర్టును ప్రభావితం చేసేలా హైకోర్టు తీర్పు ఉందని తెలిపారు.