అప్పుడు ట్రైల‌ర్‌.. ఇప్పుడు కేసీఆర్‌కు ఫుల్ మూవీ చూపిస్తాం: మోడీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచారు. ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌లు, కామెంట్లు ఆస‌క్తిగా మారాయి. తాజాగా బీఆర్ ఎస్ స‌ర్కారు, సీఎం కేసీఆర్‌పై విరుచుకుప‌డిన మోడీ.. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్‌, కేసీఆర్‌కు ఫుల్ మూవీ చూపిస్తామ‌ని తీవ్రంగా వ్యాఖ్యానించారు. బండి సంజ‌య్ పోటీ చేస్తున్న కరీంనగర్‌లో బీజేపీ సకలజనుల విజయ సంకల్ప సభలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట‌ల తూటాలు పేల్చారు.

” ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఆట ముగుస్తుంది. తొలిసారి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రానుంది. తెలంగాణ బీజేపీ తొలి సీఎం బీసీయే అవుతారు. చరిత్రలో 16 మహాజనపదాల్లో ‘అస్మక జనపదం’ ఈ ప్రాంతం. హుజూరాబాద్‌ ఉపఎన్నికతో కేసీఆర్‌కు ట్రైలర్‌ చూపించాం. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌కు పూర్తి సినిమా చూపిస్తాం” అని ప్రధాని మోడీ అన్నారు. పీవీ నరసింహరావుని కాంగ్రెస్ పార్టీ ప్రతి అడుగులో అవమానించిందని, ఇప్పుడు ఎన్నిక‌లు రాగానే ఆయ‌న ఎన‌లేని ప్రేమ కురిపిస్తోంద‌ని నిప్పులు చెరిగారు.

తెలంగాణకు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అవసరం లేదని మోడీ వ్యాఖ్యానించారు. గ్యారెంటీలను నెరవేర్చే మోడీ సర్కార్‌ తెలంగాణకు అవసరం మోడీ గ్యారెంటీ అంటే అందరికీ ఉచిత వైద్యం అందిస్తాం. మోడీ గ్యారెంటీ అంటే అందరికీ ఆరోగ్యం, మోడీ గ్యారెంటీ అంటే రైతులకు చేయూత. ప్రజా సంక్షేమం బీజేపీ ప్రాధాన్యతలు ఇవే. ఓ వైపు కేసీఆర్‌ ఉన్నారు.. మరో వైపు మీ సేవకుడు మోడీ ఉన్నాడు అని త‌న‌దైన శైలిలో హిందీలో దంచికొట్టారు.

అమిత్ షా కూడా..
మ‌రోవైపు బీజేపీ అగ్ర‌నేత అమిత్‌షా కూడా కేసీఆర్‌పై ఫైర‌య్యారు. కాంగ్రెస్‌ పార్టీతో సీఎం కేసీఆర్ కుమ్మక్కయ్యారని నిప్పులు చెరిగారు. మంచిర్యాలలో నిర్వ‌హించిన బీజేపీ స‌భ‌లో అమిత్ షా మాట్లాడుతూ… ఈ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కేసీఆర్‌కు వేసినట్టేనని అన్నారు. 2014, 2018 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ కోనేశాడని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో మళ్లీ గెలిస్తే.. మళ్లీ కేసీఆర్ కోనేస్తాడని అన్నారు. కేసీఆర్‌ను గెలిపిస్తే రాహుల్ బాబాను ప్రధానిని చేస్తాడని అమిత్ షా ఎద్దేవా చేశారు.