విధేయుడికే పట్టం.. ‘భట్టి’కి సీఎం పీఠం?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. పోలింగ్‌కు ఇంకా నాలుగు రోజేలే సమయం ఉంది. గెలుపుపై అన్ని పార్టీలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాయి. అధికార బీఆర్‌ఎస్‌తోపాటు, కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలోనే తిష్టవేసి జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ తరుణంలో సోషల్‌ మీడియాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గురించి ఓ పోస్టు వైరల్‌ అవుతోంది. ఇప్పుడిదే కాంగ్రెస్‌ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

పాదయాత్రతో ప్రజలతో మమేకం..
తెలంగాణ సమాజానికి కేసీఆర్‌ మాట ఇచ్చి తప్పగా.. అదే మాటను నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఈసారి ఎలాగైనా కేసీఆర్‌ను గద్దె దించాలని ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగుతోంది. ఈ క్రమంలో బీజేపీ బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ముందుకు వెళ్తుండగా, కాంగ్రెస్‌ ప్రచారం తుది దశకు చేరిన క్రమంలో దళిత సీఎం అంశాన్ని తెరపైకి తెస్తోంది. ప్రస్తుత సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కను తెలంగాణలో కాంగ్రెస్‌ గెలిస్తే ముఖ్యమంత్రిని చేయాలని భావిస్తోంది. వివాద రహితుడు అయిన భట్టిని సీఎం చేయడంపై ఎవరికీ అభ్యంతరం ఉండదన్నది అధిష్టానం ఆలోచన. మరోవైపు అధిష్టానంతో కూడా భట్టికి సత్సంబంధాలు ఉన్నాయి. అందుకే సీఎల్పీ నేతగా ఆయనకు తెలంగాణలో పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన ఆదిలాబాద్‌ నుంచి ఖమ్మం వరకు సుమారు 2 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమయ్యారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. కాంగ్రెస్‌ గెలిస్తే ఏం చేస్తుందో భరోసా ఇచ్చారు.

పాదయాత్రలో సమస్యలే ఎజెండాగా..
ప్రస్తుతం కాంగ్రెస్‌ విడుదల చేసిన మేనిఫెస్టోలో చాలా వరకు పాదయాత్రలో భట్టి విక్రమార్క గుర్తించినవే ఉన్నాయి. రైతులు, పోడు రైతులు, కౌలు రైతుల అంశం ఇందులో కీలకమైనది. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, జాబ్‌ క్యాలెండర్‌ వంటి అంశాలు భట్టి సూచించివే. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ భట్టి పాదయాత్ర ముగింపు సభకకు వచ్చి ఆయన పాదయాత్రలో గుర్తించిన అంశాల ఆధారంగా మేనిఫెస్టో రూపొందించాలని సూచించడమే అధిష్టానంతో భట్టికి ఉన్న సత్సంబంధాలను గుర్తు చేస్తాయి.

అందరినీ కలుపుకుపోతూ..
ఇక భట్టి పాదయాత్ర సందర్భందగా కాంగ్రెస్‌ కలిసికట్టుగా పనిచేసింది. ఎన్నికల్లో సమష్టిగా పనిచేయడానికి భట్టి పాదయాత్ర చాలా వరకు దోహదపడింది. అప్పటి వరకు పార్టీతో అంటీ ముట్టనట్లుగా ఉన్న నాయకులు కూడా పాదయాత్రటో భట్టితో కలిసి నడిచారు. మద్దతు తెలిపారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. పొలిటికల్‌గా మళ్లీ యాక్టివ్‌ అయ్యారు. విభేదాలు వీడారు. ఇందుకు భట్టి కూడా కృషి చేశారనడంలో అతిశయోక్తి లేదు.

ఎవరికీ అభ్యంతరం ఉండదు..
ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచాక భట్టి విక్రమార్కను సీఎంను చేయడంపై కాంగ్రెస్‌లో ఎవరికీ అభ్యంతరం ఉండదని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి కూడా ఇటీవల ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్‌ అధిష్టానం ఎవరిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టిన సమ్మతిస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధిష్టానం భట్టి గురించి ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దళిత కార్డు ద్వారా బీజేపీ బీసీ నినాదం, ఎస్సీ వర్గీకరణ అంశాలను అధిగమించవచ్చన్న ఆలోచనలో ఉంది.

ఎలాంటి కేసులు లేవు..
ఇదిలా ఉండగా, భట్టి విక్రమార్కపై ఎలాంటి అవనీతి అరోపణలు లేవు. క్రిమినల్‌ కేసులు లేవు. జైలుకు వెళ్తాడన్న భయం లేదు. భట్టి సీఎం అయితే బీఆర్‌ఎస్‌ ముఖ్యమంత్రులు మారుతారన్న ప్రచారానికి చెక్‌ పెట్ట వచ్చని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబర్‌ 3న ఎన్నికల ఫలితాలు కాగ్రెస్‌కు అనుకూలంగా వస్తే డిసెంబర్‌ 9న భట్టి సీఎం కావడం ఖాయమని హస్తం పార్టీ పెద్దలే చెబుతున్నారు.