కేసీయార్ మీద ఆరు నియోజకవర్గాలు మండిపోతున్నాయా ?

వివిధ కారణాలతో కేసీయార్ ప్రభుత్వం మీద తెలంగాణాలో చాలా వర్గాలు వ్యతిరేకంగా మారాయి. అయితే కేసీయార్ మీద మరో వర్గం ప్రత్యేకంగా మండిపోతోంది. ఈ వర్గం ఏమిటంటే గల్ఫ్ బాధిత కుటుంబాల వర్గం. తెలంగాణా నుండి గల్ఫ్ దేశాల్లో ఉపాధి, ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళ సంఖ్య సుమారు 15 లక్షలుంటుంది. అక్కడ పనిచేసి తిరిగి వచ్చేసిన వాళ్ళ సంఖ్య మరో పది లక్షలుంటుది.

అంటే గల్ఫ్ దేశాలతో సంబంధాలున్న వాళ్ళు సుమారు 25 లక్షలు. తెలంగాణా మొత్తంమీద ప్రధానంగా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుండే ఎక్కువమంది వెళ్ళారు, వెళుతున్నారు. గల్ఫ్ దేశాల్లో వివిధ కారణాలతో చనిపోతున్న వాళ్ళని తిరిగి తెలంగాణాకు తీసుకురావటం పెద్ద సమస్యగా మారింది. గడచిన పదేళ్ళల్లో ఆ దేశాల నుండి తెలంగాణాకు వచ్చిన డెడ్ బాడీస్ సుమారు 2 వేలు. తెలంగాణాకు వచ్చేదారి లేక అక్కడే క్రిమేట్ అయిపోయిన బాడీస్ అంతకుమించి ఉన్నాయట.

వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని 2008లో కేసీయార్ వీళ్ళని కాంగ్రెస్ ప్రభుత్వంపై బాగా రెచ్చగొట్టారు. బాధిత కుటుంబాలకు ఇస్తున్న లక్ష రూపాయలను రు. 5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే గల్ఫ్ బాధితుల కోసం రు. 500 కోట్లతో వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. అయితే తెలంగాణా ఏర్పడి పదేళ్ళయినా, కేసీయార్ రెండుసార్లు సీఎం అయినా గల్ఫ్ దేశాల బాధితులను మాత్రం పట్టించుకోలేదు. అలాగే కేటీయార్, కల్వకుంట్ల కవిత కూడా వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలను గాలికొదిలేశారు.

అందుకనే వేములవాడ, కోరుట్ల, సిరిసిల్ల, నిర్మల్, ధర్మపురి నియోజకవర్గాల్లో గల్ఫ్ బాధితుల కుటుంబాల సభ్యులే పోటీచేస్తున్నారు. వీళ్ళ టార్గెట్ ఏమిటంటే తాము గెలవటం కాదు. ఎంత అవకాశముంటే అంత బీఆర్ఎస్ అభ్యర్ధులను ఓడించటమే. వీళ్ళు పోటీచేస్తున్న ఐదు నియోజకవర్గాల్లో కేటీయార్ పోటీచేస్తున్న సిరిసిల్ల, కేసీయార్ పోటీచేస్తున్న కామారెడ్డి కూడా ఉంది. వీళ్ళ దెబ్బ కేటీయార్ మీద ఎంతుంటుందో తెలీదు కానీ కేసీయార్ మీద బలంగానే పడేట్లుంది. ఏ విషయమూ తేలాలంటే డిసెంబర్ 3వ తేదీ కౌంటింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే.