చంద్రబాబు బెయిల్ పై సుప్రీం కోర్టుకు సీఐడీ?

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ సీఐడీ అధికారులు సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు ఈ ప్రకారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశముందని తెలుస్తోంది. చంద్రబాబు మధ్యంతర బెయిల్ గడువు ఈ నెల 28న పూర్తి కావస్తోంది. దీంతో, ఈ నెల 29న చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో అధికారుల ముందు హాజరు కావాల్సి ఉంది. అయితే, రెగ్యులర్ బెయిల్ మంజూరైన నేపథ్యంలో చంద్రబాబు రాజకీయ కార్యకలాపాలలో కూడా పాల్గొనవచ్చని తెలుస్తోంది.

చంద్రబాబుపై ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలను కోర్టుకు ప్రాసిక్యూషన్ సమర్పించలేకపోయిందని హైకోర్టు అభిప్రాయపడింది. స్కిల్ ప్రాజెక్టులో దుర్వినియోగమైన నిధులు టీడీపీ ఖాతాలోకి వెళ్లాయని చెప్పడానికి ఆధారాలు లేవని తెలిపింది. రిమాండ్ కు ముందే ఆధారాలు చూపించాల్సి ఉండాల్సిందని, అందకే, దర్యాప్తులో లోపంగా భావిస్తూ రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తున్నామని వెల్లడించింది.

వాస్తవానికి చంద్రబాబుపై ఏపీ ఫైబర్ నెట్, అంగళ్లు అల్లర్లు కేసు, అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు అలైన్మెంట్ కేేసు, లిక్కర్ షాపుల కేటాయింపుల కేసులలో బెయిల్ రాలేదు. మరోవైపు, చంద్రబాబు పీటీ వారెంట్ కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ లపై తీర్పు వెలువడలేదు. మరోవైపు, చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టు త్వరలో తీర్పు వెలువరించనుంది.