కేసీఆర్ పోటీ వెనుక రూ.2వేల కోట్ల భూములే టార్గెట్: రేవంత్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద సంచలన ఆరోపణ చేశారు టీపీసీసీ రథసారధి రేవంత్ రెడ్డి. తాజా ఎన్నికల్లో గజ్వేల్ తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్న కేసీఆర్ అసలు లక్ష్యం వేరే ఉందన్న ఆయన.. రూ.2వేల కోట్ల భూములు గుంజుకునేందుకు కుట్ర పన్నినట్లుగా ఆరోపించారు. ఓటుకు రూ.10వేలు ఇచ్చి రూ.200 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమైనట్లుగా పేర్కొన్నారు.

కామారెడ్డిలోని రూ.2 వేల కోట్ల భూములు గుంజుకోవటానికి సిద్ధమైనట్లు చెప్పిన రేవంత్ రెడ్డి.. “కేసీఆర్ పోటీ చేయాలంటే సిద్దిపేట.. సిరిసిల్ల.. గజ్వేలు ఉన్నాయి. వాటిని కాదని కామారెడ్డికి వచ్చాడు. ఇక్కడి భూములు పచ్చగా కనిపించటంతో వాటిపై కన్నేశారు. గజ్వేల్ ను ఆయన.. ఆయన సుట్టపోళ్లు మొత్తం ఊడ్చేశారు. పేదల భూములు గుంజుకున్నారు. కబ్జా చేశారు. ఇప్పుడు కామారెడ్డిలో భూములను గుంజుకునేందుకు కుట్ర చేస్తున్నారు” అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

కామారెడ్డిలో కేసీఆర్ మీద తాను పోటీ చేయటానికి కారణం ఉందన్న రేవంత్.. కేసీఆర్ నుంచి రైతుల భూముల్ని కాపాడేందుకే తాను పోటీ చేస్తున్నట్లు చెప్పారు. “కేసీఆర్ ను వేటాడేందుకు వచ్చా. రైతులు.. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రాని కేసీఆర్.. ఆయన మంత్రులు.. ఎమ్మెల్యేలు ఇప్పుడు ఓట్లు అడగటానికి మాత్రం కామారెడ్డికి వస్తున్నారు. కామారెడ్డి ప్రాంతంలో రైతులు చనిపోతే రాని కేసీఆర్ కు.. ఈ రోజు అమ్మమ్మ ఊరు కోనాపూర్ గుర్తుకు వచ్చిందా?” అంటూ విరుచుకుపడ్డారు.

భారీ వర్షాల కారణంగా వడ్లు తడిచి.. నష్టపోయినప్పుడు ఎవరూ రాలేదని.. వడగండ్లతో పంటలు నష్టపోతే పట్టించుకోలేదన్నారు. అలాంటి కేసీఆర్ కు ఈ రోజున ఓటు అడిగే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. కేసీఆర్ వీధి కుక్క అని.. కేటీఆర్ పిచ్చి కుక్క అన్న రేవంత్.. “ఇక్కడి వాళ్లు బతుకుదెరువు కోసం గల్ఫ్ కు వెళ్తారు. గల్ఫ్ సంక్షేమ నిధి పెట్టి గల్ఫ్ కార్మికుల్ని ఆదుకుంటాం. గల్ఫ్ కు వెళ్లిన వారిని.. వచ్చిన వారిని ఆర్థికంగా ఆదుకుంటాం. తాను మూడు గంటల ముందే రావాల్సి ఉన్నా.. ప్రభుత్వం కుట్ర చేసి తన హెలికాఫ్టర్ ను రాకుండా అడ్డుకుంది” అంటూ విమర్శించారు. ఇప్పటివరకు కామారెడ్డిలో కేసీఆర్ పోటీకి పలు కారణాలు బయటకు వచ్చిన వేళ.. వీటికి భిన్నంగా రేవంత్ తాజాగా చేస్తున్న ఆరోపణలు సంచలనంగా మారాయి.