కాంగ్రెస్ మేనిఫెస్టోలో అదిరే హామీలు ఇవే!

తాజాగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ తన ఎన్నికల హామీని ప్రకటించింది. కేసీఆర్ సర్కారుపై తీవ్రంగా విరుచుకుపడుతూ.. ప్రభుత్వ లోపాల్ని తరచూ తెర మీదకు తీసుకొచ్చే ఆ పార్టీ.. తమ ఎన్నికల హామీలకు సంబంధించిన వివరాల్ని తాజాగా వెల్లడించింది. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను చూస్తే.. కేసీఆర్ సర్కారు అమలు చేసే పథకాల్ని కంటిన్యూ చేయటంతో పాటు.. మరిన్నిఆకర్షణీయమైన హామీల్నిఇచ్చేందుకు వీలుగా ప్రకటన చేసిందని చెప్పాలి.

నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్ల పుట్టినంతనే బంగారు తల్లి పథకంలో భాగంగా ఆర్థిక సాయం.. యువతుల పెళ్లికి రూ.లక్ష ఆర్థిక సాయమే కాదు పదిగ్రాముల బంగారాన్ని ఇవ్వనున్నట్లుగా పేర్కొంది. అంతేకాదు వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్.. అధికారంలోకి వచ్చిన ఆర్నెల్ల లోపే మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల ఖాళీల్ని భర్తీ చేయనున్నట్లు తెలిపింది. అంతేకాదు.. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు ముఖ్యమంత్రి ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అందుబాటులో ఉండరన్న విమర్శ తీవ్రంగా ఎదుర్కొంటునన నేపథ్యంలో ఎన్నికల హామీల్లోనే సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ ఏర్పాటు చేస్తామన్న మాట ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ తో పాటు.. పలు ప్రజాకర్షక పథకాల్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఇప్పటికే ఆరు ఆకర్షణీయమైన గ్యారెంటీ పథకాల్ని అమలు చేస్తామని చెబుతున్న కాంగ్రెస్.. అంతకు మించి మరిన్ని హామీల్ని తీసుకువచ్చింది. తమ ఎన్నికల మేనిఫెస్టోను అధికారికంగా విడుదల చేయనప్పటికీ.. దానిలోని అంశాలు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఎన్నికల మేనిఫెస్టోలోని ముఖ్యాంశాల్ని చూస్తే..

  • తెలంగాణ తొలి.. మలి దశ ఉద్యమ అమరవీరుల తల్లి.. తండ్రి.. భార్యకు నెలకు రూ.25 వేల చొప్పున నెలవారీ పింఛన్. ఆయా కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం. ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత. 250 చదరపు గజాల్లో ఇళ్ల స్థలం కేటాయింపు
  • రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల పంట రుణ మాఫీ. ఏటా రూ.3 లక్షల వరకు వడ్డీ లేని పంట రుణం
  • వ్యవసాయానికి 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్. ప్రధాన పంటలకు సమగ్ర బీమా పథకం
  • కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ
  • అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లకు మెగా డీఎస్సీ
  • వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదల.. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ
  • విద్యా రంగానికి రాష్ట్ర బడ్జెల్ లో 15 శాతం నిధుల కేటాయింపు
  • బాసర ట్రిపుల్ ఐటీ తరహాలో మరో నాలుగు ఏర్పాటు
  • మోకాలు శస్త్ర చికిత్సకు ఆరోగ్య శ్రీ వర్తింపు
  • ధరణి స్థానంలో భూమాత పేరుతో కొత్త పోర్టల్. ల్యాండ్ కమిషన్ ఏర్పాటు
  • గతంలో పేదలకు పంపిణీ చేసిన దాదాపు 25 లక్షల ఎకరాలపై పూర్తిస్థాయి హక్కుల కల్పన
  • ప్రభుత్వ ఉద్యోగులకు.. పింఛన్ దారులకు పెండింగ్ లో ఉన్న డీఏల తక్షణ చెల్లింపు.
  • ఉద్యోగులకు పాత పింఛన్ విధానం అమలు
  • ఆర్టీసీ కార్మికులకు రెండు పీఆర్సీ బకాయిల్ని వెంటనే చెల్లింపు
  • ప్రతి ఆటో డ్రైవర్ ఖాతాలో ఏడాదికి రూ.12వేలు జమ
  • మద్యం బెల్టు షాపులు రద్దు
  • యాదవులు.. కురుమలకు గొర్రెల పెంపకం కోసం నేరుగా రూ.2 లక్షలు అందజేత
  • 18 ఏళ్లు నిండి చదువుకుంటున్నయువతులందరికి ఎలక్ట్రిక్ స్కూటర్లు
  • హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యకు పరిష్కారం.. మరణించిన పాత్రికేయుల కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థిక సాయం
  • రేషన్ కార్డులపై సన్న బియ్యం
  • గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి బోర్డు. గల్ఫ్ లో మరణించిన కార్మికుల కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం
  • దివ్యాంగులకు నెలవారీ పింఛన్ రూ.5వేలకు పెంపు. యాభై ఏళ్లు దాటిన జానపద కళాకారులకు రూ.3016 పెన్షన్
  • మెట్రో రైళ్ల ఛార్జీల్లో మహిళలు.. పెద్దవయస్కులు.. దివ్యాంగులకు 50 శాతం రాయితీ
  • హైదరాబాద్ లో నాలాల ఆధునికీకరణ
  • రాష్ట్ర వ్యాప్తంగా ఆస్తి.. ఇంటి పన్ను బకాయిలపై జరిమానాలు రద్దు