లోకేష్, జగన్, పవన్ తో టచ్‌లో ఉంటా..

తెలంగాణ ఎన్నికలకు మరికొద్ది రోజులే ఉన్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ప్రచార జోరు పెంచారు. ఈ నేపథ్యంలోనే బహిరంగ సభలు, రోడ్ షోలు, సమావేశాలతోపాటు మీడియాకు ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఓ తెలుగు న్యూస్ ఛానెల్ బిగ్ డిబేట్ లో పాల్గొన్న కేటీఆర్…టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు మరో పదిపదిహేనేళ్లు రాజకీయం చేయగలిగిన సామర్థ్యం ఉందని కేటీఆర్ అన్నారు. చంద్రబాబుకు వయస్సేమీ అయిపోలేదని, మోదీ కంటే ఆయన చిన్నవారే అని అన్నారు.

శాంతిభద్రతల దృష్ట్యానే చంద్రబాబు అరెస్ట్ సమయంలో హైదరాబాద్‌లో నిరసనలు వద్దని చెప్పానని, అది పక్క రాష్ట్రం వ్యవహారం అని వ్యాఖ్యానించానని కేటీఆర్ మరోసారి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. చెప్పానన్నారు. కానీ, తన వ్యాఖ్యలు జనంలోకి తప్పుగా వెళ్లాయని అన్నారు. చంద్రబాబు, లోకేష్, జగన్, పవన్ కల్యాణ్‌తో తరుచూ టచ్‌లో ఉంటానని చెప్పుకొచ్చారు. చంద్రబాబు విషయంలో లోకేష్ ఆవేదన తాను అర్థం చేసుకున్నానని, తమ మధ్య సోదర భావం ఉందని అన్నారు.

6 నెలల క్రితం వరకు బీఆర్ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయమన్నారని, ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ రెండో స్థానం కోసం పోటీ పడుతున్నాయని కేటీఆర్ అన్నారు. సోషల్ మీడియాలోనే కాంగ్రెస్ హవా కనిపిస్తోందని, కాంగ్రెస్ పుంజుకుందని చెప్పేందుకు ప్రాతిపదిక ఏంటని ప్రశ్నించారు. తాము దైవాంశ సంభూతులం కాదని, తమ ప్రభుత్వంలో ఏ తప్పూ జరగలేదని తాను అనడం లేదని చెప్పారు. దాదాపు పదేళ్ల పాలనలో ఎంతోకొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉండడం సహజమని కేటీఆర్ అంగీకరించారు. బీఆర్ఎస్‌పై ప్రజల్లో కాస్త సణుగుడు ఉందని, కానీ, ఓట్లు మాత్రం తమకే వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. న్యూస్ పేపర్ వ్యూస్ పేపర్‌గా ఉండవద్దని కామెంట్ చేశారు. మోదీతో పోలిస్తే కేసీఆర్ అత్యంత ప్రజాస్వామికవాది అని అన్నారు.

కేసీఆర్ ఎవరినీ కలవకపోయినా పనులు ఆగవని, సీఎం ఎవరి మాట వినరు అన్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. ఎమ్మెల్యేలకు కేసీఆర్ పరిమితికి మించిన స్వేచ్ఛ ఇచ్చారని, అదే సమయంలో కేసీఆర్ తొలిసారి గెలవగానే ఎమ్మెల్యేలు తప్పులు చేయకుండా అదుపులో పెట్టారన్నారు.