కేటీఆర్ సమక్షంలో కారెక్కిన తుల ఉమ

వేములవాడ బీజేపీ అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ మహిళా నేత తుల ఉమ ఈ రోజు మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. తుల ఉమకు కేటీఆర్ ఫోన్ చేసి బీఆర్ఎస్ లోకి సాదరంగా ఆహ్వానించగా..ఆ ఆహ్వానాన్ని మన్నించిన ఆమె ఈ రోజు పార్టీలో చేరారు. తన అనుచరులతో కేటీఆర్ సమక్షంలో తుల ఉమా బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. తుల ఉమ పట్ల బీజేపీ తీరు మహిళలు, బీసీల పట్ల ఆ పార్టీ వైఖరికి నిదర్శనమని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. గతంలో హోదాకు మించి ఆమెకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

తెలంగాణ ఉద్యమంలో తుల ఉమ పాల్గొన్నారని గుర్తు చేశారు. కేసీఆర్ సూచన ప్రకారమే తుల ఉమకు తాను స్వయంగా ఫోన్ చేసి పార్టీలోకి ఆహ్వానించానని కేటీఆర్ చెప్పారు. అయితే, తన ఆహ్వానాన్ని మన్నించి ఆమె పార్టీలోకి రావడం సంతోషాన్నిచ్చిందని చెప్పారు. వేములవాడ అభివృద్ధితోపాటు రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతి కోసం ఆమె సేవలు అవసరమని కేటీఆర్ అన్నారు.

ఇక, బీజేపీ తనకు టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి దొడ్డిదారిన మరొకరికి ఆ టికెట్ కేటాయించిందని తుల ఉమ ఆరోపించారు. బీసీని ముఖ్యమంత్రిని చేస్తానన్న బిజెపి మాటలు ఒట్టివేనని విమర్శించారు. అందుకు తానే ఉదాహరణ అని, తనకు చెప్పింది ఒకటి చేసింది ఇంకొకటి అని ఆరోపించారు. బీఆర్ఎస్ లో తాను మొదటి నుంచి ఉన్నానని, ఇక్కడ ఇచ్చిన గౌరవం బిజెపిలో దొరకలేదని చెప్పారు.

కాగా, వైఎస్సార్టీపీ నేతలు గట్టు రామచంద్రరావుతో పాటు సత్యవతి ఆధ్వర్యంలో పలువురు నేతలు, వైటీపీ నేతలు, కోఆర్డినేటర్లు మంత్రి హరీష్ రావు సమక్షంలో బి ఆర్ ఎస్ లో చేరారు. వారందరికీ మంత్రి హరీష్ రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలలో వైఎస్ఆర్ టిపి పోటీ చేయడం లేదని, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రకటనపై ఆ పార్టీ నేతలు గట్టు రామచంద్రరావుతో పాటు పలువురు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు ఆమెకు పార్టీలో సభ్యత్వం లేదని, ఆ పార్టీ తమదని చెప్పారు. అయితే, బీఆర్ఎస్ లో వైటీపీ విలీనంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.