అడ్వాంటేజ్ కనబడటంలేదా ?

టికెట్లు దక్కని వివిధ పార్టీల్లోని చాలామంది అసంతృప్తులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. టికెట్లు వచ్చే అవకాశంలేదని తెలిసి కూడా కారులో ఎక్కి కూర్చుంటున్నారు. చివరినిముషంలో వచ్చి చేరుతున్న కొత్త నేతలకు కేసీయార్, మంత్రులు కేటాయార్, హరీష్ రావులు కూడా మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు. దాంతో ఏమవుతుందంటే పాత-కొత్త నేతల మధ్య ప్రతిరోజు వివాదాలు పెరిగిపోతున్నాయి. పార్టీలో కొత్తగా చేరారు అందులోను ఎన్నికల సమయంలో చేరారు కాబట్టి కొత్త నేతలకు ప్రాధాన్యత దక్కుతోంది.

దీన్ని పాత నేతలు తట్టుకోలేకపోతున్నారు. పైగా అభ్యర్ధులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కొందరు సీనియర్ నేతలతో కొత్త నేతల్లో కొందరు టచ్ లో ఉన్నారట. దాని వల్ల అభ్యర్ధులకు కొత్తనేతల వల్ల పెద్దగా ఉపయోగం కనబడటంలేదనే టాక్ పెరిగిపోతోంది. ఇదే విషయమై కేసీయార్, కేటీయార్, హరీష్ కూడా ఏరోజుకారోజు రిపోర్టు తెప్పించుకుంటున్నారు. ఎన్నికల్లో అభ్యర్ధులు ఓడిపోతే తర్వాత ఎన్నికల్లో తమకే ప్రాధాన్యత దక్కుతుందని, టికెట్ వచ్చే అవకాశముందని కొందరు కొత్త నేతలు ఆలోచిస్తున్నట్లు పార్టీలో ప్రచారం పెరిగిపోతోంది.

దీంతో కొత్తగా చేరిన నేతల వల్ల ఉపయోగం లేకపోయినా నష్టాలు తప్పవా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. దీంతో పార్టీపరంగా ఎంతమంది నేతల పనితీరుపై నిఘా పెట్టాలో అగ్రనేతలకు అర్ధంకావటంలేదు. బీజేపీ, కాంగ్రెస్ ను దెబ్బకొట్టడమే టార్గెట్ గా కేసీయార్, కేటీయార్, హరీష్ లు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా పై పార్టీలను ఎలాగైనా దెబ్బకొట్టాల్సిందే అన్న కసితో పై పార్టీల్లోని అసంతృప్తులందరినీ చేర్చేసుకుంటున్నారు.

ఇపుడిదే పార్టీ అభ్యర్ధులకు పెద్ద సమస్యగా తయారైంది. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్ధులకు ఇన్చార్జిలకు, సీనియర్ నేతలకు పొసగటంలేదు. ఎవరి చెప్పినట్లు వినాలో అర్ధంకాక క్యాడర్ అయోమయంలో పడిపోయింది. ఈ సమయంలో ఇతర పార్టీల నుండి కొత్తనేతలు వచ్చి చేరటంతో గందరగోళం మరింతగా పెరిగిపోతోంది. పెరిగిపోతున్న సమన్వయ లోపం చివరకు పార్టీ పుట్టిముంచేస్తుందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇన్చార్జి వ్యవస్ధ కూడా పార్టీకి మైనస్ అయ్యిందనే ప్రచారం పెరిగిపోతోంది. ఏదో చేయబోయి కేసీయార్ ఏదో చేశారా అనే అనుమానాలూ పెరిగిపోతున్నాయి. చివరకు ఎన్నికల్లో ఫలితం ఎలాగుంటుందో చూడాల్సిందే.