ఇచ్చిన మాటకు కట్టుబడి పాలన చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. గత ఎన్నికలకు ముందు వైసీపీ హయాంలో రాష్ట్రం అన్ని విధాలా సర్వనాశనం అయిందన్నారు. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే.. రాష్ట్రాన్ని బాగు చేస్తామని, అన్ని వ్యవస్థలను గాడిలో పెడతామని హామీ ఇచ్చామని .. ప్రజలు నమ్మి తమను అధికారంలోకి తీసుకువచ్చారని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీని అడుగడుగునా నిలబెట్టుకుంటున్నామని సీఎం చెప్పారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు.
పల్నాడు జిల్లాలోని నరసరావుపేట నియోజకవర్గంలో నిర్వహించిన రుణ మేళా కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురికి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించారు. ఈ పత్రాలను స్వయంగా కేంద్ర మంత్రినిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో 10 రూపాయలు 20 రూపాయల వడ్డీలకు ప్రైవేటు వ్యాపారాలు ఆ నాయకులే చేసి.. ప్రజల రక్తం పీల్చారని తెలిపారు.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. బ్యాంకులతో మాట్లాడి తక్కువ వడ్డీలకే రుణాలు ఇచ్చే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని సీఎం తెలిపారు. డ్వాక్రా సంఘాలకు 25 పైసలుకే బ్యాంకులు రుణాలు ఇచ్చేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. సరిగా రుణాలు తీర్చిన వారికి ఆ వడ్డీని కూడా ప్రభుత్వమే మాఫీ చేస్తోందన్నారు. అలాగే చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వారికి కూడా తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నట్టు చెప్పారు.
నిర్మలమ్మ ఆదర్శం..
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్పై సీఎం చంద్రబాబు ప్రశంసలు గుప్పించారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో నిర్మలా సీతారామన్కు తిరుగులేదని వ్యాఖ్యానించారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని డ్వాక్రా సంఘాల్లోని మహిళలు ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకోవాలని.. ఆర్థికంగా ఎదగాలని సూచించారు. డ్వాక్రా సంఘాలకే కాకుండా.. ఇతర స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. “ఇది మహిళాసాధికారతకు పెద్దపీట వేసే ప్రభుత్వం. మహిళల చైతన్యం కోసం అనేక పథకాలు తీసుకువచ్చాం.“ అని ఆయన వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates