క‌రీంన‌గ‌ర్ కాపులు ఎటువైపు? ఆస‌క్తి రేపుతున్న ఓటు బ్యాంకు!

క‌రీంన‌గ‌ర్‌.. ప్ర‌స్తుత అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అంద‌రినీ ఆక‌ర్షిస్తున్న కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం. ఇక్క‌డ నుంచి బీజేపీ మాజీ సార‌థి, ఎంపీ బండి సంజ‌య్ పోటీ చేస్తుండ‌డ‌మే దీనికి కార‌ణం. అయితే.. ఈయ‌న‌తోపాటు కాంగ్రెస్‌, బీఆర్ ఎస్ ల నుంచి కూడా బ‌ల‌మైన నాయ‌కులు బ‌రిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి స‌ర్పంచ్ పుర‌మ‌ళ్ల శ్రీనివాస్, బీఆర్ ఎస్ నుంచి మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ త‌ల‌ప‌డుతున్నారు. వీరంతా కూడా మున్నూరు కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన వారే కావ‌డం గ‌మ‌నార్హం.

సామాజిక వ‌ర్గమే కీల‌కం

ప్ర‌తినియోజ‌క‌వ‌ర్గంలోనూ కొన్ని కొన్ని సామాజిక వ‌ర్గాలు ఎలాగైతే.. బ‌లంగా ఉంటాయో క‌రీంన‌గ‌ర్‌లోనూ రెండు కీల‌క సామాజిక వ‌ర్గాలు బ‌లంగా ఉన్నాయి. ఈ వ‌ర్గాలే అభ్య‌ర్థుల జాత‌కాన్ని నిర్ణ‌యిస్తున్నాయి. వీటిలో మున్నూరు కాపులు, ముస్లింలు ముంద‌జ‌లో ఉన్నారు. గ‌తంలో వెలమ సామాజిక వ‌ర్గం ఆధిక్య‌త క‌న‌బ‌రిచినా… రానురాను మున్నూరు కాపుల ఓట్లు, ఆధిప‌త్యం పెరిగింది. దీంతో మున్నూరు కాపు, ముస్లింవ‌ర్గాల ఓట్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌డం అభ్య‌ర్థుల‌కు కీల‌కంగా మారింది.

ఓట్లు ఇలా..

  • క‌రీంన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం ఓట్లు: 3,40,520
  • వీటిలో మున్నూరు కాపుల ఓట్లు : 60,892
  • ముస్లిం ఓట‌ర్లు: 68,952
  • వెలమ సామాజిక వ‌ర్గం ఓట్లు: 39,785
  • రెడ్డి సామాజిక వ‌ర్గం ఓట్లు: 21,985

అభ్య‌ర్థుల బ‌లాబలాలు..

  • బీజేపీ: ఫైర్ బ్రాండ్ బండి సంజ‌య్ గ‌ట్టిపోటీ ఇస్తున్నారు. గ‌త మూడుఎన్నిక‌ల్లోనూ ఆయ‌న ఇక్క‌డ నుంచే పోటీ చేస్తుండ‌డంతో సింప‌తీ పెరిగింద‌నే వాద‌న వినిపిస్తోంది. పైగా ఆయ‌న అనుచ‌రులు సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌చారం చేస్తున్నారు.

. బీఆర్ ఎస్: మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌.. నాలుగోసారి పోటీకి దిగారు. ఇప్ప‌టికి మూడు సార్లు గెలిచి హాట్రిక్ కొట్టారు. బ‌ల‌మైన కార్య‌క‌ర్త‌లు, అనుచ‌రుల అండ‌. కేసీఆర్ ఇమేజ్ వంటివి ఇక్క‌డ క‌మ‌లాక‌ర్‌కు ప‌నిచేస్తున్నాయి.

  • కాంగ్రెస్‌: కరీంనగర్ రూరల్ మండలానికి జ‌డ్పీటీసీగా పనిచేసిన పురుమల్ల శ్రీనివాస్ కాంగ్రెస్ త‌ర‌ఫున బ‌రిలో నిలిచారు. కాంగ్రెస్ చీఫ్ రేవంత్ ఇమేజ్‌, బీఆర్ ఎస్ వ్య‌తిరేక‌త‌పైనే ఆశ‌లు పెట్టుకున్నారు.

ముగ్గురికి క‌లిసివ‌చ్చే అంశాలు

  • మున్నూరు కాపు ట్యాగ్‌
  • బ‌ల‌మైన యువ‌త ఓట్లు

ఎవ‌రి ప్ర‌చారం ఎలా ఉంది?

గంగుల‌: కరీంనగర్‌లో రోడ్లు, కేబుల్ బ్రిడ్జ్, మానేరు రివర్ ఫ్రంట్, ఐటి టవర్, మెడికల్ కాలేజ్, టిటిడి టెంపుల్, ఇస్కాన్ టెంపుల్ ఇవన్నీ తీసుకువచ్చానని గంగుల క‌మ‌లాక‌ర్‌ ప్రచారం చేసుకుంటున్నారు. బండి సంజయ్ ఎంపిగా గెలిచి రూపాయి పని చెయ్యలేదని, పురుమళ్ల‌ శ్రీనివాస్ ఒక రౌడి షీటర్ అని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

బండి: సంజయ్ ప్రధానంగా కేసీఆర్, కేటీఅర్‌లను లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలని ఎండగడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లోపాలు, గ్రూప్ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ, ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం వైపల్యం, మంత్రి గంగుల కమలాకర్ తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డులు ఒక్కటి కూడా ఇవ్వలేదని ఆరోపణలు చేస్తున్నారు.

పురుమ‌ళ్ల‌: కాంగ్రెస్ అభ్యర్థి పురుమళ్ల‌ శ్రీనివాస్‌.. జడ్పీటీసీగా, సర్పంచ్‌గా చేసిన‌సేవ‌ల‌ను ఏక‌రువు పెడుతున్నారు. మున్నూరు కాపు సామజిక వర్గంతో పాటుగా ముస్లిం మైనారిటీ‌లలో శ్రీనివాస్‌కి మంచి పట్టు ఉండడంతో తనకే మున్నూరు కాపులు, ముస్లిం ఓట్లు ప‌డ‌తాయ‌ని భావిస్తున్నారు.