ఎవరైనా వస్తారేమోనని బీజేపీ ఎదురు చూపులు

తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసేందుకు ఇంకో రెండు రోజుల సమయం కూడా లేదు. ఈ నెల పదే చివరి తేదీ. ఓ వైపు అధికార బీఆర్ఎస్ ఇప్పటికే 119 మంది అభ్యర్థులకు బీ ఫాంలు అందజేసింది. మరోవైపు కాంగ్రెస్ ఇంకా పూర్తి జాబితా ప్రకటించలేదు. బీజేపీది కూడా కాంగ్రెస్ లాంటి పరిస్థితే. బీజేపీ ఇంకా 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి ఎవరైనా కీలక నేతలు పార్టీలోకి వస్తారేమోనని బీజేపీ ఎదురు చూస్తున్నట్లు తెలిసింది.

తెలంగాణ ఎన్నికల కోసం బీజేపీ వరుసగా 52, 1, 35, 12 మంది అభ్యర్థులతో నాలుగు జాబితాలను ఇప్పటివరకూ విడుదల చేసింది. దీంతో ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 100 కు చేరింది. మరోవైపు పొత్తు కారణంగా జనసేనకు 8 స్థానాలు కేటాయించింది. ఇక మిగిలింది 11 స్థానాలు. మల్కాజిగిరి, పెద్దపల్లి, శేరిలింగపల్లి, మేడ్చల్, నాంపల్లి, సికింద్రాబాద్, కంటోన్మెంట్, అలంపూర్, మధిర, నర్సంపేట, సంగారెడ్డి నియోజకవర్గాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

అలంపూర్ లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించినా బీ ఫాం దక్కించుకోలేకపోయిన అబ్రహం తమ పార్టీలోకి వస్తారేమోనని బీజేపీ ఎదురు చూస్తోంది. మధిర, నర్సంపేట తదితర స్థానాల్లోనూ ఇతర పార్టీ నాయకులు వస్తే టికెట్లు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్లు టాక్. మరోవైపు మల్కాజిగిరిలో రామచందర్ రావు, ఆకుల రాజేందర్ మధ్య, శేరిలింగపల్లిలో గజ్జల యోగానంద్, రవికుమార్ యాదవ్ మధ్య తీవ్ర పోటీ ఉంది. మరి నాయకుల మధ్య సయోధ్య కుదిర్చి వీలైనంత త్వరగా మిగిలిన స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది.