ఎనిమిది మందితో జ‌న‌సేన అభ్య‌ర్థుల జాబితా విడుద‌ల‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీతో క‌లిసి పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీ ఆమేర‌కు పొత్తులు ఫైన‌ల్ చేసుకున్న విష‌యం తెలిసిందే. మొత్తం 119 స్థానాల తెలంగాణ అసెంబ్లీలో జ‌న‌సేన‌కు బీజేపీ 9 స్థానాలు కేటాయించింది. వీటిపై తాజాగా ఓ క్లారిటీకి వ‌చ్చిన జ‌న‌సేన‌.. వెంట‌నే అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసింది. మొత్తం జ‌న‌సేన‌కు కేటాయించిన 9 స్థానాల‌కుగాను.. 8 చోట్ల అభ్య‌ర్థుల‌ను జ‌న‌సేన ప్ర‌క‌టించింది. వీటిలో కూక‌ట్‌ప‌ల్లి, కోదాడ‌, నాగ‌ర్ క‌ర్నూల్‌, అశ్వారావు పేట వంటి కీల‌క నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి.

ఎవ‌రెవ‌రు ఎక్క‌డెక్క‌డ‌?

కూక‌ట్ ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం టికెట్‌ను ప్ర‌ముఖ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్‌కు కేటాయించారు. తాండూరు టికెట్‌ను వేమూరి శంక‌ర్ గౌడ్‌కు, కీల‌క‌మైన కోదాడ టికెట్‌ను మేక‌ల స‌తీష్‌రెడ్డికి ఇచ్చారు. అదేవిధంగా నాగ‌ర్ క‌ర్నూల్ టికెట్‌ను వంగా ల‌క్ష్మ‌ణ గౌడ్‌, ఖమ్మం టికెట్‌ను మిర్యాల రామ‌కృష్ణ‌కు కేటాయించారు. కొత్త‌గూడెం టికెట్‌ను ల‌క్కినేని సురేంద‌ర్‌, వైరా టికెట్‌ను డాక్ట‌ర్ తేజావ‌త్ సంప‌త్‌కు కేటాయించ‌రు. అదేవిధంగా అశ్వారావు పేట టికెట్ ను మ‌య‌బోయిన ఉమాదేవికి కేటాయించారు. మొత్తంగా 8 టికెట్ల‌లో ఒక‌టి మ‌హిళ‌కు కేటాయించ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, టికెట్ల వారీగా చూస్తే.. ఉమ్మ‌డి ఖమ్మం జిల్లాలోని ఖ‌మ్మం, కొత్త‌గూడెం, వైరా, అశ్వారావుపేట వంటి నాలుగు కీల‌క నియోజ‌క‌వ‌ర్గాలు జ‌న‌సేనకు ద‌క్కాయి. ఇక‌, ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాలోని కోదాడ‌ను కేటాయించారు. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ ఎస్‌, కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య పోటీ తీవ్రంగా ఉంది. అదేస‌మ‌యంలో ఖ‌మ్మం వంటి చోట మాజీ మంత్తి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, ప్ర‌స్తుత మంత్రి పువ్వాడ అజ‌య్‌లు త‌ల‌ప‌డుతున్నారు. అదేవిధంగా నాగ‌ర్ క‌ర్నూలు కూడా గ‌ట్టి పోటీ ఇస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన‌కు కేటాయించిన టికెట్ల‌ను ప‌రిశీలిస్తే.. ఆ పార్టీ నాయ‌కులు చెమ‌టోడిస్తే త‌ప్ప‌.. గెలుపు గుర్రం ఎక్క‌డం క‌ష్ట‌మ‌నే బావ‌న క‌నిపిస్తోంది.