బీజేపీ వస్తే బీసీ ముఖ్యమంత్రి: మోడీ

హైదరాబాద్ లో జరిగిన బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు కే లక్ష్మణ్, ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితర నేతలు హాజరయ్యారు. నా కుటుంబ సభ్యులారా అంటూ తన ప్రసంగాన్ని ప్రధాని మోడీ తెలుగులో ప్రారంభించారు.

సభలో సమ్మక్క సారలమ్మ… యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారిని మోడీ తలుచుకున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే పదాల్ని తెలుగులో పలికిన మోడీ. నా కుటుంబ సభ్యులారా.. అంటూ పలుమార్లు పలికి అందరినీ అలరించారు. పుణ్యభూమి తెలంగాణకు ప్రమాణాలు అని మోడీ వ్యాఖ్యానించారు. మోడీ తెలుగులో మాట్లాడగానే సభా ప్రాంగణం అంతా అరుపులు, కేరింతలు, కేకలతో దద్దరిల్లిపోయింది.

ఈ సందర్భంగా బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రధాని మోడీ ప్రకటించారు. అత్యధికంగా బీసీ ఎంపీలు బిజెపి నుంచే ఉన్నారని ప్రధాని గుర్తు చేశారు కేంద్ర క్యాబినెట్ లో కూడా ఓబీసీలకు ప్రాధాన్యతనిచ్చామని వెల్లడించారు. ఈ వేదికపై పవన్ కళ్యాణ్ తనతో ఉన్నారని, మైదానంలో జన సునామీ ఉందని పవన్ ను ఉద్దేశించి మోడీ ప్రశంసలు గుప్పించారు. తెలంగాణ బిజెపిపై ప్రజలు విశ్వాసం ఉంచి ఈ సభకు హాజరయ్యారని అన్నారు. బిఆర్ఎస్ నేతల్లో అహంకారం కనిపిస్తోందని, ఈ అవినీతి సర్కారును ప్రజలు ఇంటికి పంపడం ఖాయమని మోడీ జోస్యం చెప్పారు.

2019 లోక్ సభ ఎన్నికల్లో నే టిఆర్ఎస్ కు ప్రజలు గుణపాఠం చెప్పారని మోడీ గుర్తు చేశారు. ఇక, బీఆర్ఎస్ నేతలకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో సంబంధాలున్నాయని, ఆ కేసు దర్యాప్తు చేస్తుంటే ఇక్కడ ప్రజలు సీబీఐ, ఈడీలను తిడుతున్నారని ప్రధాని అన్నారు. ప్రజాధనాన్ని దోచుకున్న వారి నుంచి తిరిగి రాబడతామని, అవినీతిని అంతం చేస్తామని చెప్పారు. ప్రభుత్వం వైఫల్యం వల్లే టిఎస్పిఎస్సి పేపర్ లీక్ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు.