స‌ర్వే రాయుళ్ల‌పై స‌ర్వ‌త్రా సందేహాలు.. ఎందుకంటే!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చిత్ర‌మైన స‌ర్వేలు వ‌స్తున్నాయి. ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న అనంత‌రం.. వెంట‌నే రంగంలోకి దిగిన ఏబీపీ-సీఓట‌రు స‌హా ప‌లు స‌ర్వే సంస్థ‌లు తెలంగాణ సమాజం నాడి ప‌ట్టుకునే ప్ర‌య త్నం చేశాయి. తొలి నాళ్ల‌లో అధికార పార్టీపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉంద‌ని చెబుతూ వ‌చ్చిన సంస్థ‌లు.. త‌ర్వాత‌ త‌ర్వాత ప‌దును పెంచాయి. బీఆర్ ఎస్ వైపు మొగ్గు చూపాయి. ఇప్పుడు వ‌స్తున్న అన్ని స‌ర్వేలూ.. బీఆర్ ఎస్‌కు అనుకూలంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.

అదేస‌మ‌యంలో తెలంగాణ ఇచ్చామ‌ని చెబుతున్న కాంగ్రెస్‌కు ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు లేద‌ని.. అభివృద్ధి చేశామ‌ని చెబుతున్న బీజేపీ వైపు ప్ర‌జ‌లు అస‌లు చూడ‌డం లేద‌ని.. స‌ర్వేలు వెల్ల‌డిస్తున్నాయి. తాజాగా వ‌చ్చిన జీ-టీవీ స‌ర్వే ఏకంగా బీఆర్ ఎస్‌కు 77-86 స్థానాలు వ‌స్తాయ‌ని స్ప‌ష్టం చేసింది. దీనికి ముందు ఇండియా టుడే, ఆత్మ‌సాక్షి, ఏబీపీ వంటి సంస్థ‌లు మాత్రం కేసీఆర్‌కు 55-60 స్థానాల్లోపే వ‌స్తాయ‌ని స్ప‌ష్టం చేసింది.

ఇక‌, కాంగ్రెస్‌కు మాత్రం 45-60 మ‌ధ్య‌లో వ‌స్తాయ‌ని కొన్ని సంస్థ‌లు, కాదు.. 60-70 మ‌ధ్య వ‌స్తాయ‌ని కొన్ని సంస్థ‌లు ఆదిలో చెప్ప‌గా.. ఇప్పుడు ఈ లెక్క ఏకంగా స‌గానికి స‌గం ప‌డిపోయి.. 33-40 మ‌ధ్య తారాడుతోంది. కేవ‌లం 15 రోజుల వ్య‌వ‌ధిలోనే ఈ ర‌కంగా స‌ర్వేలు మారిపోవ‌డం.. ఒక్కొక్క స‌ర్వేలో ఒక్క విధ‌మైన ఫ‌లితాలు రావ‌డంతో అసలు స‌ర్వేల‌ను న‌మ్మొచ్చా? తెర‌వెనుక ఏం జ‌రుగుతోంది? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

క‌ర్ణాట‌క‌లో ఈ ఏడాది మేలో జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ భిన్న‌మైన స‌ర్వేలు వ‌చ్చాయి. అధికార పార్టీ బీజేపీకి అనుకూలంగా.. మెజారిటీ సంస్థ‌లు ప్ర‌క‌టించాయి. కానీ, ఎన్నిక‌ల ఫ‌లితం మాత్రం కాంగ్రెస్‌కు దిగ్విజ‌యం క‌ట్ట‌బెట్టింది. దీనిని ఎవ‌రూ ఊహించ‌లేదు. పైగా.. స‌ర్వే సంస్థ‌లు అధికార పార్టీకి అనుకూలంగా ఫ‌లితాలు ఇచ్చాయ‌నే వాద‌న బ‌లంగా వినిపించింది. ఇక‌, ఇప్పుడు కూడా తెలంగాణ‌లో ఇదే ప్ర‌చారం ప్రారంభం కావ‌డం గ‌మ‌నార్హం. ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ఏదైనా జ‌ర‌గొచ్చు.. అనే భావ‌న ప్ర‌జ‌ల్లో వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి తెర‌వెనుక ఏం జ‌రుగుతోందో తెలియాలంటే.. కొంత వెయిట్ చేయ‌క‌త‌ప్ప‌దు.