బీఆర్ ఎస్‌ను ఉడుకెత్తిస్తున్న ఉత్త‌ర తెలంగాణ!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లను అన్ని పార్టీలూ ప్రాణంగా భావిస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ బీఆర్ ఎస్‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్‌లు ఈ ఎన్నిక‌ల్లో చావో రేవో తేల్చుకునేందుకు రెడీ అయ్యాయి. దీంతో ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని తీవ్ర‌త‌రం చేశాయి. పార్టీల ప‌రంగా, నేత‌ల ప‌రంగా, ఓటు బ్యాంకుపై లెక్క‌లు కూడా వేసుకుంటున్నాయి. ఇదిలావుంటే, ప్రాంతాల వారీగా చూసుకున్న‌ప్పుడు.. ఉత్త‌ర తెలంగాణ బాగా వెనుక‌బాటులో ఉంది.

ఈ రీజియ‌న్‌లోని కీల‌క‌మైన జిల్లాల్లో కొన్ని మాత్ర‌మే అభివృద్ధిలో ఉంటే.. ఓటు బ్యాంకు రాజ‌కీయంగా ఉప‌యోగ‌ప‌డుతున్న ఎస్సీ, ఎస్టీలు, ఆదివాసీలు ఎక్కువ‌గా ఉన్న జిల్లాల్లో అభివృద్ధి, ఉద్యోగ క‌ల్ప‌న‌, ఉపాధి వంటివి ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. దీంతో ఉత్త‌ర తెలంగాణ‌లోని జిల్లాల్లో ప్ర‌జ‌లు స్త‌బ్దుగా ఉన్నారు. ఈ ప‌రిధిలో ఆదిలాబాద్‌, కొమ‌రంభీమ్ ఆసిఫాబాద్‌, నిర్మ‌ల్‌, మంచిర్యాల‌, నిజామాబాద్‌, జ‌గిత్యాల‌, పెద్ద‌ప‌ల్లి, కామారెడ్డి, రాజ‌న్న సిరిసిల్ల‌, క‌రీంన‌గ‌ర్ జిల్లాలు ఉన్నాయి.

వీటిలో నిజామాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, మంచిర్యాల వంటివి అంతో ఇంతో అభివృద్ధికి నోచుకోగా.. మిగిలిన జిల్లాల్లో ప్ర‌జ‌లకు ఇప్ప‌టికీ తాగు నీరు అంద‌డం లేదు. క్షేత్ర‌స్థాయిలో ప‌థ‌కాలు కూడా చేరువ కావ‌డం లేదు. ఇక‌, ప్ర‌జ‌ల‌తో ఓటు వేయించుకున్న నాయ‌కులు త‌ర్వాత క‌నిపించ‌డం కూడా లేదు. దీంతో ఇక్క‌డి వారు విసిగిపోయిన‌ట్టే క‌నిపిస్తోంది. తాజాగా ఇక్క‌డ బీఆర్ ఎస్ నాయ‌కులు నిర్వ‌హించిన స‌భ బోసి పోయింది.

అధికార పార్టీ బీఆర్ ఎస్ నాయ‌కులకు కూడా ప్ర‌జ‌ల నుంచి జోష్ క‌నిపించ‌డం లేదు. వారు చెబుతున్న మాట‌ల‌ను ప్ర‌జ‌లు వింటున్నా.. ప‌ట్టించుకోవ‌డం లేద‌నే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, కాంగ్రెస్ ప‌రిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీ క‌నిపించ‌డం లేదు. అయితే.. మార్పు కోరుకుంటున్న వారు మాత్రం అంతో ఇంతో జై కొడుతున్నారు. ముఖ్యంగా ఆదివాసీల‌కు ఏదో చేశామ‌ని అధికార పార్టీ చెబుతున్నా.. వారి స‌భ‌ల‌కు జ‌నం డుమ్మా కొడుతున్న వైనాన్ని బ‌ట్టి.. ఉత్త‌ర తెలంగాణ‌లో అధికార పార్టీకి ఎదురీత త‌ప్ప‌ద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.