పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న కేసీఆర్

తెలంగాణ ఎన్నికలకు మరికొద్ది రోజుల గడువు మాత్రమే ఉండడంతో సీఎం కేసీఆర్ ప్రచారంలో తలమునకలయ్యారు. వరుస సభలు, రోడ్ షోలతో ప్రజలతో మమేకమయ్యేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్రలో బహిరంగ సభకు హాజరయ్యేందుకు వెళ్లిన కేసీఆర్ కు పెను ప్రమాదం తప్పింది. కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక లోపం ఏర్పడిన వైనం సంచలనం రేపుతోంది.

దేవరకద్రకు బయలుదేరిన కాసేపటికే ఆ లోపాన్ని పైలట్ గుర్తించారు. తక్షణమే అప్రమత్తమైన పైలట్ హెలికాఫ్టర్ ను వెనక్కు మళ్లించి ఎర్రవల్లికి వెళ్లారు. కేసీఆర్ ఫాంహౌస్ లోని హెలిప్యాడ్ పై క్షేమంగా హెలికాప్టర్ ను దించారు. కేసీఆర్ ప్రయాణించేందుకు మరో హెలికాఫ్టర్ ను రెడీ చేస్తున్నట్లు ఏవియేషన్ అధికారులు తెలిపారు. కేసీఆర్ కు ప్రమాదం తప్పిందన్న వార్త తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకుంటున్నారు.