ప్రచార పంథాలో కేటీఆర్ మార్కు

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు అధినేత కేసీఆర్ కష్టపడుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పార్టీ అభ్యర్థుల విజయానికి పాటుపడుతున్నారు. వివిధ నియోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొంటూ ప్రజల ఓట్లను మరోసారి సాధించే దిశగా సాగుతున్నారు. తన సొంత నియోజకవర్గంలో సిరిసిల్లాలో పరిస్థితిని సమన్వయం చేసుకుంటూనే.. మరోవైపు ఇతర అభ్యర్థుల విజయం కోసం వ్యూహాల్లో కేటీఆర్ మునిగిపోయారు. ఈ నేపథ్యంలో ప్రచారంలో కేటీఆర్ కొత్త ట్రెండు క్రియేట్ చేశారనే చెప్పాలి.

ఇప్పటికే సభలు, సమావేశాలు ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రచారాన్ని కేటీఆర్ హోరెత్తిస్తున్నారు. అటు సామాజిక మాధ్యమాల్లోనూ కాంగ్రెస్, బీజేపీ వైఖరిని దుయ్యబడుతూ.. ఆ పార్టీలకు అవకాశం ఇవ్వొద్దని, బీఆర్ఎస్ నే గెలిపించాలని కోరుతున్నారు. ఇప్పుడికి యూట్యూబ్ పై కేటీఆర్ ఫోకస్ పెట్టారనే చెప్పాలి. తాజాగా ఓ ప్రముఖ ఛానెల్ లో కేటీఆర్ సందడి చేశారు. ఓ గ్రామంలో నాటుకోడి కూర వండి, దీన్ని తింటూ తమ ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్, అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. ‘మై విలేజ్ షో’.. గ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన యూట్యూబ్ ఛానెల్ ఇది. దీనికి సంబంధించిన వాళ్లే ఇప్పుడు ‘కల్లివెల్లి’ అని మరో ఛానెల్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడీ ఛానెల్ లో కేటీఆర్ తళుక్కుమన్నారు. ఆ గ్రామంలో ఛానెల్ యువకులు, గంగవ్వ, అంజిమామతో కలిసి కేటీఆర్ సందడి చేశారు.

పొలాల మధ్యలో చికెన్ వండి, దీన్ని తింటూ కనిపించారు. ఈ క్రమంలో పదేళ్లుగా వివిధ రంగాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్, తెచ్చిన సంక్షేమ పథకాలను కేటీఆర్ వివరించారు. ఎన్నికల నేపథ్యంలో దొరికిన ప్రతి అవకాశాన్ని కేటీఆర్ సమర్థంగా వాడుకుంటున్నారనేందుకు ఇదే నిదర్శనం. ఈ వీడియోలో తమ ప్రభుత్వ పాలన గురించి చెప్పిన కేటీఆర్ ఎక్కడా బీఆర్ఎస్ కు ఓటు వేయాలని కోరకపోవడం గమనార్హం. అయితే చేసిన డెవలప్మెంట్ చూసి ప్రజలే ఓట్లు వేస్తారన్నది కేటీఆర్ ఆలోచన. ఈ ఛానెల్ కు ఇప్పుడు 4.72 లక్షల సబ్ స్క్రైబర్లున్నారు. ఇప్పటికే ఈ వీడియోను 11 లక్షలకు పైగా మంది వీక్షించారు. గ్రామాలు, పట్టణాల్లోని యువత, పెద్దవాళ్లు అనుసరించే ఈ ఛానెల్ లో ఈ వీడియోతో బీఆర్ఎస్ కు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రచారం దొరుకుతుందనడంలో సందేహం లేదు.