లోకేష్ బాధలో న్యాయముంది: కేటీఆర్

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ మరోసారి స్పందించారు. చంద్రబాబు అరెస్టు మానవీయ కోణంలో సరికాదని కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా చూసిన 73 ఏళ్ల వయస్సున్న చంద్రబాబును అరెస్టు చేయడం సరికాదని, ఈ విషయం తెలిసిన ఎవరైనా అయ్యో పాపం అని అంటారని కేటీఆర్ చెప్పారు. ఇక, చంద్రబాబు భద్రతపై లోకేష్ ఆందోళన వ్యక్తం చేయడం సబబేనని కేటీఆర్ అన్నారు.

గతంలో తాము టిడిపిని విమర్శించడం వాస్తవమేనని, అయితే 2018లో కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకుందని, ఆ కోణంలోనే తాము టీడీపీపై విమర్శలు గుప్పించామని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయని 2023 ఎన్నికల్లో టిడిపి పోటీ చేయడం లేదు కాబట్టి ఆ పార్టీపై విమర్శలకు తావేలేదని కేటీఆర్ చెప్పారు. ఇక, భారత క్రికెట్ జట్టుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు లింకు పెట్టి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. స్వదేశంలో జరుగుతున్న క్రికెట్ ప్రపంచ కప్ లో టీమిండియా అద్భుతంగా రాణిస్తుందని, అదేవిధంగా తెలంగాణ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ తప్పక విజయం సాధిస్తుందని కేటీఆర్ అన్నారు. టీమిండియా, కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారని జోస్యం చెప్పారు.

ఎన్నికల రేసులో బిజెపి లేదని, కాంగ్రెస్ తమ ప్రత్యర్థి అని కేటీఆర్ స్పష్టం చేశారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కష్టాలు, కన్నీళ్లు, కడగండ్లు ,అంధకారం, మత కలహాలు, అరాచకం తప్పవని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఎన్నికలు ఢిల్లీ దొరలకు, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్నాయని రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కొందరు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రజలు అసంతృప్తితో ఉన్న మాట వాస్తవమేనని కేటీఆర్ అంగీకరించారు. కానీ. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి ఫలాలు 90 శాతం మంది ప్రజలకు అందించామని, మెజార్టీ ప్రజలు తమతోనే ఉన్నారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.