కాంగ్రెస్ కు ఇంకో చాన్స్ అక్కరలేదు: కేసీఆర్

తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ రేపు వెలువడనున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకొని హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. మరోవైపు, పదేళ్లపాటు పాలన చేసి వ్యతిరేకతను మూటగట్టుకున్న బీఆర్ఎస్ ను గద్దె దించాలని కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ముమ్మరంగా బహిరంగ సభలు నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్…ప్రతిపక్షాలపై పదునైన విమర్శలతో విరుచుకుపడుతున్నారు.

ఓటు వేసేముందు ఆలోచించుకోవాలని, ఆ ఓటు మీ కిస్మత్ మారుస్తుందని కేసీఆర్ అన్నారు. అదే ఓటు ప్రజల జీవితాలను తలకిందులు చేయగలదని కేసీఆర్ హెచ్చరించారు. 11 సార్లు అధికారం చేపట్టిన కాంగ్రెస్ చేసిందేమీ లేదని, ఆ పార్టీకి ఇంకో చాన్స్ అవసరం లేదని కేసీఆర్ చెప్పారు. రైతు బంధు దుబారా అని కాంగ్రెస్ నేతలంటున్నారని, పెట్టుబడి సాయం దుబారా అవుతుందా? అని ప్రశ్నించారు.

కర్ణాటకలో కాంగ్రెస్ 5 గంటల విద్యుత్ ఇస్తుంటే తెలంగాణలో 24 గంటలు ఇస్తున్నామని చెప్పారు. రాబోయే సంవత్సరం నుంచి రైతుబంధును రూ.12వేలకు పెంచి…క్రమంగా రూ.16వేలు చేస్తామని హామీనిచ్చారు. గ‌తంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు ధ‌ర్మ‌పురి అభివృద్ధిపై ఫోకస్ చేయలేదని, ఈశ్వ‌ర్ పాలనలో డెవలప్ జ‌రిగిందని చెప్పారు. వాగుల‌పై చెక్ డ్యాంలు కట్టించారని, మిష‌న్ కాక‌తీయ కింద చెరువుల‌ను బాగు చేసుకున్నామని గుర్తు చేసుకున్నారు.

తెలంగాణ వ‌చ్చిన కొత్త‌లో చిమ్మ‌చీక‌ట్లు, మంచి నీళ్లు, సాగునీళ్లు లేవని, వ‌ల‌స బ‌తుకులు, ఎక్క‌డ చూసినా అంధ‌కార‌మే అని గుర్తు చేసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో క‌రెంట్, తాగు నీటికి ఇబ్బంది లేదని, సాగునీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుందామని చెప్పారు. 24 గంట‌ల విద్యుత్ లేదని ప్రధాని మోదీ అన్నారని, ఆయనకు ప్రయివేటైజేషన్ పిచ్చి పట్టుకుందని మండిపడ్డారు.