ఒక రోడ్డు వేస్తే ఏపీ.. రెండు రోడ్లేస్తే తెలంగాణ‌: కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో తొలిసారి బీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్‌.. ఏపీ ప్ర‌స్తావ‌న తీసుకువ‌చ్చారు. ఏపీలో ఎలాంటి అభివృద్ధి లేద‌ని.. తెలంగాణ అభివృద్ధిలో ప‌రుగులు పెడుతోంద‌ని ఆయ‌న ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. “ఒక రోడ్డు వేస్తే.. దానిని ఏపీ అంటారు. రెండు రోడ్లు వేస్తే.. అది తెలంగాణ‌”-అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఏపీలో ప్ర‌స్తుతం చీక‌ట్లు అలుముకున్నాయ‌ని చెప్పారు. కానీ, ప‌సిమొగ్గ‌గా ఉన్న తెలంగాణ రాష్ట్రం మాత్రం వెలుగులు విర‌జిమ్ముతోంద‌ని తెలిపారు. తాజాగా ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా(ఏపీ స‌రిహ‌ద్దు)లోని స‌త్తుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ ఎస్ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ నిర్వ‌హించింది.

ఈ స‌భ‌లో పాల్గొన్న సీఎం కేసీఆర్‌.. ఏపీ అభివృద్ధికి-తెలంగాణ అభివృద్ధికి లింకు పెట్టి మాట్లాడారు. “ఖమ్మం జిల్లా ప్రజలు ఏపీ, తెలంగాణ రోడ్లను పరిశీలించాలి. డబుల్‌ రోడ్‌ వస్తే తెలంగాణ‌.. సింగిల్‌ రోడ్‌ వస్తే ఏపీ” అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ ధాన్యం తెలంగాణలో అమ్ముకుంటున్నారని ఎద్దేవా చేశారు. “సత్తుపల్లి చాలా చైతన్యం ఉన్న ప్రాంతం. సత్తుపల్లిలో 70 వేల మెజార్టీతో సండ్ర వెంక‌ట వీరయ్య‌ గెలుపు ఖాయమైంది. ఎన్నికలు చాలా వస్తాయి.. పోతాయి.. నిలబడే అభ్యర్థి ఎవరు.. అతని పార్టీ చరిత్ర ఏంటో తెలుసుకోవాలి” అని ఇక్క‌డి వారికి కేసీఆర్ పిలుపునిచ్చారు.

కిర‌ణ్ చెప్పింది జ‌రుగుతోందా?
తెలంగాణ వ‌స్తే.. చీక‌ట్లు క‌మ్ముకుంటాయ‌ని.. నీటికోసం యుద్ధాలు జరుగుతాయ‌ని తెలంగాణ ఏర్పాటు స‌మ‌యంలో అడ్డం చెప్పిన అప్ప‌టి ముఖ్యమంత్రి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి చెప్పింది జ‌రుగుతోందా? అని కేసీఆర్ ప్ర‌శ్నించారు. “నాడు క‌ర్ర ప‌ట్టుకుని ఉటాయించిండు. తెలంగాణ రాకుండా అడ్డువ‌డిండు. కానీ, కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. నాడు క‌రెంటు రాద‌ని, నీళ్ల కోసం కొట్లాట‌లు జ‌రుగుతాయ‌న్న కిరణ్‌కుమార్ ఎక్క‌డున్న‌డు” అంటూ.. కేసీఆర్ ఎద్దేవా చేశారు.

ద‌ళితుల శ్రేయ‌స్సును దృష్టిలో పెట్టుకునే ద‌ళిత బంధును తీసుకువ‌చ్చిన‌ట్టు కేసీఆర్ చెప్పారు. గ‌తంలో అన్ని పార్టీలూ ద‌ళితుల‌ను ఓటు బ్యాంకుగానే చూశాయ‌ని, వాడుకున్నాయ‌ని చెప్పారు. దళితుల శ్రేయస్సు గురించి ఎవరూ ఆలోచించలేదన్నారు. అందుకే ద‌ళిత బంధును తీసుకువ‌చ్చామ‌ని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ గెలుపు ఖాయ‌మ‌ని కేసీఆర్ ఉద్ఘాటించారు.