తెలంగాణ‌పై రాహుల్ స్పెష‌ల్ ట్రీట్‌మెంట్‌.. టార్గెట్ కేసీఆర్‌!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేస్తామ‌ని ప‌దే ప‌దే చెబుతున్న కాంగ్రెస్ పార్టీ.. ఆ దిశ‌గా దూకుడు పెంచింది. ప్ర‌స్తు తం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో అత్యంత బిజీగా ఉన్న కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ.. కాంగ్రెస్ పాలిత ఛ‌త్తీస్‌గ‌ఢ్, రాజ‌స్తాన్‌ల కంటే కూడా తెలంగాణ‌పైనే ఎక్కువ‌గా దృష్టి పెట్టారు. ప్ర‌తి 15 రోజుల‌కురెండు సార్లు తెలంగాణ‌లో ప‌ర్య‌టిస్తున్నారు. ప్ర‌ధానంగా అధికార పార్టీ బీఆర్ ఎస్‌ను కేంద్రంగా చేసుకుని రాహుల్ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్‌-కాంగ్రెస్ మ‌ధ్యే యుద్ధం జ‌రుగుతుంద‌ని రాహుల్ తాజాగా తేల్చి చెప్పారు.

అంతేకాదు.. సీఎం కేసీఆర్‌పై రాహుల్‌గాంధీ తీవ్ర విమ‌ర్శ‌లే గుప్పించారు. రాష్ట్రం ఏర్ప‌డిన ప‌దేళ్ల‌లో కేసీఆర్ ఇక్క‌డి ప్ర‌జ‌ల సొమ్మును దోచుకున్నార‌ని.. తాము అధికారంలోకి రాగానే కేసీఆర్ ఆయ‌న కుటుంబం దోచుకున్న సొమ్మును కక్కిస్తామ‌ని రాహుల్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఈ సొమ్మును ప్ర‌జ‌ల ఖాతాల్లోనూ జ‌మ‌చేస్తామ‌ని చెప్పారు. ఇక‌, త‌న ప్ర‌సంగాల్లో రాష్ట్ర అభివృద్ధిని కూడా రాహుల్ ప్ర‌స్తావిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు సార్లు బ‌హిరంగ స‌భ‌ల్లో పాల్గొన్న రాహుల్‌.. కేసీఆర్ ల‌క్ష్యంగానే దూకుడు చూపించారు.

నిజానికి విభ‌జ‌న చ‌ట్టాన్ని, అందులో పేర్కొన్న అంశాల‌ను మోడీ ప్ర‌భుత్వం అమ‌లు చేసేందుకు ముందుకు రాక‌పోవ‌డాన్ని రాహుల్ ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అయితే.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ విష‌యంలో కృత‌జ్ఞ‌త చూపించాల‌ని మాత్రం ఆయ‌న కోరుతున్నారు. అదేస‌మ‌యంలో బీఆర్ ఎస్‌, బీజేపీలు.. ముఖ్య‌మంత్రి విష‌యంలో ఒకింత క్లారిటీతోనే ఉండ‌గా.. కాంగ్రెస్ మాత్రం ఈవిష‌యంలో ఎక్క‌డా పెద‌వి విప్ప‌డం లేదు. రాహుల్ కూడా సీఎం సీటుపై ఎక్క‌డా నోరు జార‌డం లేదు. అయితే.. స్థానికంగా ఉన్న గిరిజ‌నులు, ఆదివాసీల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

అదేవిధంగా నీళ్లు-నిధులు-నియామ‌కాల‌తోపాటు.. ఆరు గ్యారెంటీల‌ను రాహుల్ ప్ర‌స్తావిస్తున్నారు. తాము క‌ర్ణాట‌క‌లో వీటిని అమ‌లు చేశామ‌ని.. ఇప్పుడు ఇక్క‌డ కూడా అమ‌లు చేస్తామ‌ని రాహుల్ తెలంగాణ స‌మాజాన్ని త‌మ‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మొత్తంగా.. ఐదు రాష్ట్రాల్లో రెండు చోట్ల అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ.. ఆయా రాష్ట్రాల‌పై కంటే కూడా తెలంగాణ‌పైనే రాహుల్ ఎక్కువ‌గా దృష్టి పెట్ట‌డం.. సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేయ‌డం .. రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అయింది. మ‌రి ఈ దూకుడు.. ఏమేర‌కు ఫ‌లిస్తుందో చూడాలి.