మాధ‌వ్‌తో మ‌రింత డ్యామేజీ

ఏ పార్టీలో అయినా.. దూకుడుగా ఉండే నాయ‌కులు ఉంటారు. అదేవిధంగా హ‌ద్దులు దాటే నాయ‌కులు కూడా ఉంటారు. అయితే.. మ‌రీ దారుణంగా వ్య‌వ‌హ‌రించ‌డం.. స‌మాజంలో క‌ల్లోల ప‌రిస్థితులు సృష్టించేలా రాజ‌కీయాలు చేయ‌డం అంటే.. అది ఏపార్టీకైనా ఇబ్బందిక‌ర‌మే. ఇప్పుడు ఏపీ అధికార పార్టీ కూడా ఇదే ప‌రిస్థితిని ఎదుర్కొంటున్న‌ట్టు ఆ పార్టీ నేత‌లే వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

వాస్త‌వానికి వైసీపీలో చాలా మంది ఫైర్ బ్రాండ్ నాయ‌కులు ఉన్నారు. అదేవిధంగా బూతులు మాట్లాడే నాయకులు కూడా ఉన్నార‌ని టీడీపీ నాయ‌కులు త‌ర‌చుగా విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే ఉన్నారు. వీరి ప‌రిస్థితి ఎలా ఉన్నా.. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్ చేష్ఠ‌ల‌తో పార్టీ ప‌రిస్థితి దారుణంగా మారింద‌ని.. తాము తలెత్తుకోలేక పోతున్నామ‌ని.. ఆయ‌న వ్య‌తిరేక వ‌ర్గం పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం చేస్తోంది.

గ‌తంలో మాధ‌వ్‌.. న్యూడ్ వీడియో క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. ఎవ‌రో మ‌హిళ‌తో ఆయ‌న న్యూడ్ కాల్ చేయ‌డం.. ఇది సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున వైర‌ల్ కావ‌డం అంద‌రినీ సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గురి చేసింది. దీనిపై పార్టీలోనూ అంత‌ర్గ‌త నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. అయితే.. బీసీ(కుర‌బ‌) సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి కావ‌డంతో అప్ప‌ట్లో ఈ ఘ‌ట‌న‌ను వైసీపీ లైట్ తీసుకుంది. కానీ, క్షేత్ర‌స్థాయిలో మ‌హిళ‌లు ఇప్ప‌టికీ ఎంపీని ఏవ‌గించుకుంటూనే ఉన్నారు.

దీంతో ఎంపీ మాధ‌వ్ రెండేళ్లుగా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. ఇదిలావుంటే, తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు పై ఆయ‌న చేసిన వికృత వ్యాఖ్య‌లు మ‌రింత‌గా వైసీపీని డ్యామేజీ చేయ‌డం ఖాయ‌మ‌ని ఆ పార్టీ నేత‌లు త‌ల ప‌ట్టుకున్నారు. చంద్ర‌బాబు అరెస్టు ద‌రిమిలా ఇప్ప‌టికే వైసీపీని ఎవ‌రూ న‌మ్మ‌డం లేద‌ని, ఉద్దేశ పూర్వ‌కంగానే బాబును జైల్లో పెట్టార‌ని అంద‌రూ అనుకుంటున్నార‌ని.. ఇప్పుడు ఏకంగా చంద్ర‌బాబు ఛ‌స్తాడు అని వ్యాఖ్యానించి పార్టీని మ‌రింత ఇర‌కాటం లో పెట్టార‌ని సీనియ‌ర్ నాయ‌కులు త‌ల్ల‌డిల్లుతున్నారు. ఇలాంటి వారు పార్టీకి అవ‌స‌ర‌మా? రేపు ప్ర‌జ‌ల్లోకి ఏమొహం పెట్టుకుని వెళ్లాల‌నివారు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి పార్టీ అధిష్టానం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుందో చూడాలి.