బీసీలను బ్యాలెన్స్ చేసిన కాంగ్రెస్

రాబోయే తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం బీసీలకు పెద్ద పీట వేసినట్లే కనబడుతోంది. ఇప్పటికి ప్రకటించిన 100 సీట్లలో 20 నియోజకవర్గాల్లో బీసీ నేతలకు టికెట్లు దక్కాయి. పెండింగులో ఉన్న మరో 19 నియోజకవర్గాల్లో కూడా ఐదుగురు బీసీ నేతలకు టికెట్లు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అంటే హోలు మొత్తంమీద 25 మంది బీసీలకు టికెట్లు ఇచ్చినట్లవుతుంది. నిజానికి 34 నియోజకవర్గాలను బీసీలకు కేటాయించాలన్నది బీసీ నేతల డిమాండ్.

అయితే బీసీల డిమాండు ప్రకారం 34 సీట్లు కేటాయిస్తే అగ్రవర్ణాల్లోని మిగిలిన కులాల్లో గోల పెరిగిపోతుంది. మొత్తం జనాభాలో బీసీల జనాభా సగం అన్నది వాస్తవమే అయినా టికెట్ల కేటాయింపు దగ్గరకు వచ్చేసరికి దామాషా ప్రకారం కేటాయింపులు సాధ్యంకావని అందరికీ తెలుసు. బీసీ నేతలు 34 టికెట్లు కావాలని డిమాండ్లు చేస్తే పార్టీ 25 టికెట్లు కేటాయిస్తోంది. పైగా కేటాయింపు కూడా సీనియర్లు, ఇతర పార్టీల నుండి చేరిన వాళ్ళ మధ్య బ్యాలెన్స్ చేసుకున్న విషయం అర్ధమవుతోంది.

అందుకనే బీసీ నేతలు, సంఘాల నుండి పెద్దగా ప్రతిఘటన, ఆందోళనలు ఎదురుకావటంలేదు. అధిష్టానం నిర్ణయంపై బీసీ నేతల్లో కూడా చాలామంది హ్యాపీగానే ఉన్నట్లు అర్ధమవుతోంది. బీఆర్ఎస్ అయితే బీసీలకు కేటాయించిన సీట్లు 22 మాత్రమే. అంటే బీఆర్ఎస్ తో పోల్చుకుంటే కాంగ్రెస్ అదనంగా మూడు సీట్లను కేటాయించినట్లే అని స్పష్టమవుతోంది. కమ్మలు, బ్రాహ్మణ సామాజికవర్గాలకు కూడా బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ లో ఎక్కువ సీట్లే దక్కినట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్ లో టికెట్ల కేటాయింపులో అంతా కేసీయార్ ఇష్టప్రకారమే ఏకపక్షంగా సాగిన విషయం అందరికీ తెలిసిందే. అసంతృప్త నేతలు తమ గోడు చెప్పుకోవడానికి కూడా కేసీయార్ ఎవరికీ అవకాశం ఇవ్వలేదు. ఇదే కాంగ్రెస్ విషయానికి వస్తే రోజుల తరబడి సీనియర్ నేతలను దగ్గర కూర్చోబెట్టుకుని అధిష్టానంలోని కీలక నేతలు చర్చలు జరిపి టికెట్లను ఫైనల్ చేశారు. ఏ రకంగా చూసినా కాంగ్రెస్ లోనే ప్రజాస్వామ్య పద్ధతిలో అభ్యర్థుల ఎంపిక జరిగినట్లు అర్ధమవుతోంది. అభ్యర్థుల ఎంపిక వరకు ఓకేనే మరి ప్రచారం, ఫలితం ఎలా ఉంటుందో చూడాల్సిందే.