బీజేపీలో కూడా సేమ్ సీనేనా ?

తెలంగాణా బీజేపీలో విచిత్రమైన పరిస్ధితులు కనబడుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్నట్లే ఈ పార్టీలో కూడా అసమ్మతి, తిరుగుబాట్లు మొదలవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో అసమ్మతి, అసంతృప్తులు, తిరుగుబాట్లు ఉన్నాయంటే అర్ధముంది. కానీ బీజేపీలో కూడా కనబడుతోందంటేనే విచిత్రంగా ఉంది. కారణం ఏమిటంటే మొత్తం 119 నియోజకవర్గాల్లో పోటీకి పార్టీలో గట్టి అభ్యర్ధులు లేరన్నది వాస్తవం. గట్టి అభ్యర్ధులను కూడా తయారుచేసుకోలేని పార్టీలో కూడా టికెట్ల కేటాయింపు సందర్భంగా అసంతృప్తులు, తిరుగుబాట్లంటేనే విడ్డూరంగా ఉంది.

టికెట్లు దక్కకపోవటంతో కొన్ని నియోజకవర్గాల్లో నేతలు మండిపోతున్నారు. వీళ్ళంతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలిసి తాము రెబల్ అభ్యర్ధులుగా పోటీలో ఉండబోతున్నట్లు వార్నింగులు ఇస్తున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో టికెట్ వస్తుందని ఏనుగుల రవీందరరెడ్డి చాలాకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. పార్టీలో యాక్టివ్ గా ఉండే ఏనుగుల టికెట్ పై బాగా ఆశలు పెట్టుకున్నారు. అయితే పార్టీ మాత్రం రావు పద్మకు టికెట్ ప్రకటించింది. దాంతో ఏనుగుల మండిపోతున్నారు.

అలాగే మానుకొడూరులో పార్టీ సీనియర్ నేత శంకర్ ను పక్కనపెట్టేసి ఈమధ్యనే పార్టీలో చేరిన ఆరేపల్లి మోహన్ కు టికెట్ దక్కింది. రామగుండంలో ఈమధ్యనే పార్టీలో చేరిన జెడ్పీటీసీ కందుల సంధ్యారాణికి టికెట్ దక్కటం సీనియర్ నేతలను బాగా మండిస్తోంది. గోషామహల్ టికెట్ ను విక్రమ్ గౌడ్ కు కేటాయించబోతున్నట్లు ఇంతకాలం పార్టీ ఫీలర్లు వదిలింది తీరాచూస్తే సిట్టింగ్ ఎంఎల్ఏ రాజాసింగ్ కే కేటాయించటంతో విక్రమ్ గౌడ్ మండిపోతున్నారు.

నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో పోటీచేయాలని చాలాకాలంగా పనిచేసుకుంటున్న మాజీ ఎంఎల్ఏ యెండల లక్ష్మీనారాయణకు పార్టీ మొండిచెయ్యి చూపింది. టికెట్ ప్రకటించిన ధన్ పాల్ సూర్యానారాయణ గుప్తాను యెండల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి అసంతృప్తి వాదులు పెరిగిపోతున్నారు. వీళ్ళని పార్టీ నాయకత్వం ఎలా కన్వీన్స్ చేస్తుందన్నది పాయింట్. ఇదేకాకుండా చాలామంది ముఖ్యనేతలకు మొదటిజాబితాలో టికెట్లు ప్రకటించలేదు. దాంతో వాళ్ళంగా అయోమయంలో పడిపోయారు. మొత్తానికి టికెట్ల ప్రకటన అన్నది బీజేపీలో పెద్ద అయోమయానికి గురిచేస్తోందన్నది వాస్తవం.