మేకపాటి విక్రమ్ రెడ్డిపై ఈడీ కేసు

వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసిన వ్యవహారం ఏపీ రాజకీయాలలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. మేకపాటి కుటుంబానికి చెందిన కేఎంసీ అనే సంస్థకు అనుబంధంగా ఉన్న గురువాయూర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ (జీఐపీఎల్) టోల్ చార్జీల వసూలు వ్యవహారంపై చర్చ జరుగుతోంది. కేరళలో రహదారుల నిర్మాణం కోసం కేఎంసీ తరఫున స్థాపించిన ఆ సంస్థ రోడ్డు నిర్మాణం పూర్తి కాకుండా, బస్ షెల్టర్లు నిర్మించకుండా.. టోల్ చార్జీలు, ప్రకటన చార్జీలు వసూలు చేస్తోందని ఆరోపణలు వచ్చాయి.

ఈ నేపథ్యంలోనే ఈడీ పలు చోట్ల సోదాలు జరిపడంతో పాటు పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలోనే జీఐపీఎల్ డైరెక్టర్ మేకపాటి విక్రమ్ రెడ్డి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై మేకపాటి విక్రమ్ రెడ్డి స్పందించారు. 50 ఏళ్లుగా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగంలో తమ సంస్థ ఉందని, పబ్లిక్, ప్రైవేటు ప్రాజెక్టు పనుల్లో ఇటువంటి విచారణలు సాధారణమని అన్నారు. తమ కంపెనీతోపాటు తమతో కలిసి పనిచేస్తున్న మరో కంపెనీపై కూడా విచారణ జరిగిందని తెలిపారు. ఈడీ కోరిన డాక్యుమెంట్లు ఇచ్చామని, విచారణకు పూర్తిగా సహకరిస్తున్నామని అన్నారు.

ఏది ఏమైనా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై ఇటువంటి ఆరోపణలు రావడం సంచలనం రేపుతోంది. ఏపీలోనే కాకుండా పక్క రాష్ట్రాలలో కూడా స్కాములకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.