పశ్చిమ బెంగాల్ వ్యూహం తెలంగాణలో!

2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ అనుసరించిన వ్యూహాన్నే.. ఇప్పుడు తెలంగాణలోనూ అమలు చేయనుందా? కేసీఆర్ కు చెక్ పెట్టేందుకు ప్రణాళిక అమలు చేయనుందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో దెబ్బ కొట్టాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది. అందుకే గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్ ను బరిలో దింపేందుకు రంగం సిద్ధమైందని సమాచారం.

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో టీఎంపీ అధినేత్రి మమతా బెనర్జీని దెబ్బ కొట్టేందుకు బీజేపీ వ్యూహాలు పన్నింది. ముఖ్యంగా మమతా బెనర్జీని ఓడిస్తే ఆ పార్టీ స్థైర్యం దెబ్బ తింటుందనే ఆలోచన చేసింది. అందుకే టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన సువేందు అధికారిని మమతా బెనర్జీకి పోటీగా నిలబెట్టింది. నందిగ్రామ్ లో మమతా బెనర్జీపై సువేందు విజయం సాధించారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ హవా కొనసాగడంతో వరుసగా మూడో సారి ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆరు నెలల లోపు దీదీ మళ్లీ పోటీ చేసి విజయం సాధించారు.

ఇప్పుడు తెలంగాణలోనూ వరుసగా రెండు సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను కట్టడి చేసేందుకు బీజేపీ అదే వ్యూహాన్ని అమలు చేయనుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ సారి కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. గజ్వేల్ లో కేసీఆర్ ఓడించేందుకు బీజేపీ తీవ్రంగా కసరత్తలు చేస్తోంది. అందుకు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ ను ప్రయోగించాలని చూస్తోంది. అందుకే ఈటలకు హుజూరాబాద్ తో పాటు గజ్వేల్ టికెట్ కేటాయించేందుకు హైకమాండ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరోవైపు ఈటల కూడా అధిష్ఠానం ఆదేశిస్తే కేసీఆర్ పై పోటీ చేస్తానని ఇప్పటికే చాలా సార్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో గజ్వేల్ లో కేసీఆర్ వర్సెస్ ఈటల పోటీ ఖాయమేనని చెప్పాలి. మరి పశ్చిమ బెంగాల్ లాగా ఇక్కడ కూడా బీజేపీ అనుకున్న ఫలితం రాబడుతుందేమో చూడాలి.