చంద్రబాబు ఆరోగ్యం..లోకేష్ కు కేటీఆర్ బాసట

రాజమండ్రి జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ పై ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన సతీమణి భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్, కోడలు నారా భువనేశ్వరిలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు డీ హైడ్రేషన్, స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్నారని, జైల్లోని కలుషిత నీరు, అపరిశుభ్ర వాతావరణం వల్ల ఆయన ఆరోగ్యం పాడవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 73 ఏళ్ల వయసులో చంద్రబాబుపై కక్ష సాధిస్తున్నారని జగన్ పై లోకేష్ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఆరోగ్యంపై, లోకేష్ ఆందోళనపై మంత్రి కేటీఆర్ స్పందించారు.

చంద్రబాబు ఆరోగ్యంపై లోకేష్ ట్వీట్ బాధ కలిగించిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుడిగా తండ్రి ఆరోగ్యంపై ఆందోళన ఎలా ఉంటుందో తనకు తెలుసని కేటీఆర్ అన్నారు. గతంలో తెలంగాణ కోసం కేసీఆర్ నిరాహార దీక్ష చేసే సమయంలో తాను కూడా లోకేష్ మాదిరి ఆందోళన చెందానని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలనే ఇక్కడ ఆందోళనలు వద్దంటున్నామని కేటీఆర్ మరోసారి అన్నారు.

చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు ఆందోళనలు ఏపీలో, రాజమండ్రిలో చేసుకోవాలని హైదరాబాద్ లో వద్దని కొద్ది రోజుల క్రితం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేటీఆర్ కామెంట్లపై హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని ఆంధ్రా సెటిలర్ల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమయింది. దీంతో, మరికొద్ది రోజుల్లో జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని డ్యామేజీ కంట్రోల్ లో భాగంగానే కేటీఆర్ తాజాగా చంద్రబాబు ఆరోగ్యం గురించి సానుభూతి వ్యక్తం చేస్తూ కామెంట్లు చేశారని విమర్శలు వస్తున్నాయి.