4 నెల‌ల ముందుగానే అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌.. వైసీపీ వ్యూహం ఏంటి?

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న‌కు నాలుగు మాసాల స‌మ‌యం ఉంది. ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని ప్ర‌చారం జ‌రిగినా.. సాధార‌ణ షెడ్యూల్ ప్ర‌కార‌మే ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. సో.. దీనిని బ‌ట్టి వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి చివ‌రి వారం లేదా మార్చి తొలి వారంలో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. అయితే.. దీనికి ఇంకా నాలుగు మాసాల స‌మ‌యం ఉంది. కానీ, ఇంత‌లోనే సీఎం జ‌గ‌న్ స్వ‌యంగా అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌కు తెర‌తీశారు.

కాకినాడ జిల్లా సామ‌ర్ల‌కోట‌లో గురువారం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో దొర‌బాబును అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించారు. అంతే కాదు, ఆయ‌న‌ను గెలిపించాల‌ని ప్ర‌జ‌ల‌కు విన్న‌వించ‌డంతో పాటు, దొర‌బాబును త‌న త‌మ్ముడ‌ని, బాగా క‌ష్ట‌ప‌డుతున్నార‌ని కొనియాడారు. దీంతో 2024 ఎన్నిక‌ల‌కు సంబంధించి తొలి టికెట్‌ను సీఎం జ‌గ‌న్ అధికారికంగా ప్ర‌క‌ట‌న చేసిన‌ట్టు అయింది. అయితే, దీనివెనుక(ఇలా ప్ర‌క‌టించ‌డం వెనుక‌) రెండు వ్యూహాలు ఉన్నాయ‌నే చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో సాగుతోంది.

ఒక‌టి.. వైసీపీ ఎమ్మెల్యేల‌ను మ‌రింత‌గా దారిలో పెట్ట‌డం. ప్ర‌స్తుతం ఉన్న 150(సీఎం మిన‌హా) మంది ఎమ్మెల్యేలు ప్ర‌జ‌ల్లోనే వివిధ కార్య‌క్ర‌మాల పేరుతో ఉంటున్నారు. అయితే, వారిని మ‌రింత‌గా ప్ర‌జ‌ల్లో తిరిగేలా చేయ‌డం, సీఎం మెప్పు పొందితేనే త‌ప్ప టికెట్ ద‌క్క‌ద‌నే అభిప్రాయం వారిలో క‌లిగించ‌డం ప్ర‌ధాన అంశంగా ఉంది. అదేవిధంగా త‌నకు న‌చ్చితే త‌క్ష‌ణం టికెట్ ప్ర‌క‌టిస్తాన‌నే సంకేతాన్ని కూడా సీఎం జ‌గ‌న్ పంపించిన‌ట్టు అయింది. ఇది..ఒక‌ర‌కంగా పార్టీని, నాయ‌కుల‌ను మ‌రింత షైన్ చేసుకునేందుకు అవ‌కాశం ఏర్ప‌రుచుకున్న‌ట్ట‌యింది.

రెండో వ్యూహం.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీని డిఫెన్స్‌లో ప‌డేయడం అంటున్నారు ప‌రిశీల‌కులు. మాన‌సికంగా, రాజ‌కీయంగా కూడా వైసీపీ ద్రుఢంగా ఉంద‌ని, అందుకే ఎన్నిక‌ల‌కు అభ్య‌ర్థుల‌ను కూడా ప్ర‌క‌టిం చేస్తోంద‌నే చ‌ర్చ ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌నే ఉద్దేశం క‌నిపిస్తోంద‌ని చెబుతున్నారు. ఇక‌, టీడీపీ కానీ, జ‌న‌సేన కానీ.. ఇలా త‌మంత దూకుడుగా లేవ‌నే సంకేతాల‌ను కూడా వైసీపీ ప‌రోక్షంగా ప్ర‌జ‌ల్లోకి పంపించ‌డం కూడా చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఏదేమైనా.. ఎన్నిక‌ల‌కు నాలుగు మాసాల ముందుగానే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డం వెనుక వైసీపీ పెద్ద వ్యూహంతోనే ఉందనేది రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నా.