సోమవారం కోర్టుకు చంద్రబాబు హాజరు

టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో అదుపులోకి తీసుకున్న తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైల్లో గత నెల రోజులుగా రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఆ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు బెయిల్ నిరాకరించింది. మరోవైపు, ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు పీటీ వారెంట్ కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు తాజాగా నేడు పీటీ వారంట్ కు అనుమతించింది. పీటీ వారంట్ పై వాదనలను విన్న ఈ తీర్పును వెలువరించింది. దీంతో, సోమవారం నాడు చంద్రబాబును ప్రత్యక్షంగా కోర్టు ముందు హాజరుపరచాలని సీఐడీ అధికారులను ఆదేశించింది.

ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు చంద్రబాబును విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. ఒకవేళ శుక్రవారం సుప్రీంకోర్టు తీర్పు వస్తే జోక్యం చేసుకోవచ్చని చంద్రబాబు తరఫు లాయర్లకు జడ్జి సూచించారు. ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపున దమ్మాలపాటి శ్రీనివాస్, సీఐడీ తరపున వివేకానంద వాదించారు. దీంతో, చాలా రోజుల తర్వాత చంద్రబాబును రెండోసారి కోర్టులో ప్రత్యక్షంగా హాజరుపరిచే అవకాశాలున్నాయి. ఇక, అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పును శుక్రవారం నాడు వెల్లడించనున్నారు.

మరోవైపు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో లోకేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం డిస్పోజ్ చేసింది. స్కిల్ కేసులో లోకేష్ ను నిందితుడిగా చూపలేదని, అరెస్టు చేయమని సీఐడీ చెప్పింది. అవసరమైతే 41 ఏ నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతామని సీఐడీ తెలిపింది. దీంతో, ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు డిస్పోజ్ చేసింది.